"ఆ నిధులు మాకొద్దు"- ఆరెస్సెస్ కు 90 మంది అమెరికా రాజకీయ నాయకుల షాక్..!
అమెరికాలో ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పర్యటన తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్వదేశంలో ఇతర మతాలపై వివక్ష చూపిస్తూ... అమెరికాకు వచ్చి మత సామరస్యం, విశ్వ ఐక్యత అంటూ ప్రసంగాలు చేసిన మోహన్ భగవత్ తీరుపై అక్కడి రాజకీయ నాయకులు (US Lawmakers) అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోతున్నారు. ఇందులో భగవత్, ఆరెస్సెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్న భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, ప్రమీలా జయపాల్ సహా 90 మంది అమెరికా రాజకీయ నాయకుల బృందం.. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల నుండి వచ్చే విరాళాల్ని తిరస్కరిస్తామని ప్రతిజ్ఞ చేసింది.
మోహన్ భగవత్ టూర్ కు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యాక్షన్, సేక్రెడ్ యాక్ట్స్, వారి భాగస్వాములు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇందులో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యాక్షన్ అనేది అమెరికాకు చెందిన ఒక రాజకీయ ప్రచార బృందం. సేక్రెడ్ యాక్ట్స్ అనేది ఓ కూటమి. ఈ రెండు సంస్థలు మానవ హక్కులు, ప్రపంచ దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్థానికంగా అవగాహన కల్పించేందుకు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటిలో ఉన్న 90 మంది యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, మేయర్లు, స్థానిక ఎన్నికైన అధికారులు, అలాగే డెమోక్రటిక్స, రిపబ్లికన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఆరు పేజీల ప్రతిజ్ఞపై సంతకాలు చేశారు.

రాజకీయ హింస, బెదిరింపుల్ని తిరస్కరించాలని, అలాగే గతంలో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న సంస్థల నుండి స్వీకరించిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని లేదా దానిని ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే సంస్థలకు మళ్లించాలని రాజకీయ నాయకులకు వీరు పిలుపునిచ్చారు. అయితే వీరికి వ్యతిరేకంగా.. ఆరెస్సెస్, భగవత్ కు మద్దతుగా హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే మరో సంస్ధ.. ఇది తీవ్రవాద వామపక్ష సంస్థల పనిగా అభివర్ణించింది. ఇది అమెరికా వ్యతిరేక, హిందూ వ్యతిరేకమైనదని తెలిపింది.














Click it and Unblock the Notifications