గ్యాస్ లీక్..డెడ్లీ బ్లాస్ట్: ఆసుపత్రిలో భారీ పేలుడు: 19 మంది దుర్మరణం: ఎన్నో అనుమానాలు
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 12 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్లినిక్లో గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ పేలుడు సంభవించిందని టెహ్రాన్ డిప్యూటీ మేయర్ హమీద్ రెజా తెలిపారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

రాత్రి 10 గంటల సమయంలో
ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని తజ్రీష్ బజార్లో గల సైనా అథర్ ఆసుపత్రిలో రాత్రి 10 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఆసుపత్రి టాప్ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్లో మొదట పేలుడు సంభవించింది. వరుసగా అయిదుసార్లు స్వల్పంగా పేలుళ్లు సంభవించాయి. పేషెంట్లకు సరఫరా చేయడానికి అందుబాటులో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లలో తొలుత గ్యాస్ లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని హమీద్ రెజా తెలిపారు. పేలుడు సంభవించడానికి గల అసలు కారణంపై ఆరా తీస్తున్నామని చెప్పారు.
సిలిండర్ల స్టోరేజీలో తొలుత గ్యాస్ లీక్
ఈ ఘటనలో 19 మంది మరణించినట్లు టెహ్రాన్ అగ్నిమాపక విభాగం అధికారి జలాల్ మలేకీ తెలిపారు. తొలుత 13 మృతదేహాలను తాము స్వాధీనం చేసుకున్నామని, రెండు గంటల తరువాత మరో ఆరు మృతదేహాలను వెలికి తీశామని తెలిపారు. ఆసుపత్రి బేస్మెంట్లో ఉన్న సిలిండర్ల స్టోరేజీలో తొలుత గ్యాస్ లీక్ అయినట్లు గుర్తించామని అన్నారు. ఆసుపత్రి టాప్ ఫ్లోర్లో మొదట పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు జలాల్ చెప్పారు.
పెద్ద ఎత్తున మంటలు
పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఆసుపత్రి భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది అగ్నిమాపక బృందాలు మంటలు నియంత్రించడానికి కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని జలాల్ చెప్పారు.
Recommended Video

భీతావహ వాతావరణం
ఆసుపత్రి భవనానికి ఆనుకునే ఉన్న అపార్ట్మెంట్లకు అగ్నికీలలు వ్యాపించాయి. ఫలితంగా- అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్ల సైరన్ల మోతలతో తజ్రీష్ బజార్లో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు సమాచారం అందిన వెంటనే టెహ్రాన్ డిప్యూటీ మేయర్ సహా పలువురు స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications