అమెరికా పక్కా ప్రణాళిక.. 6 నెలల నుంచి అల్ జవహరీపై నిఘా.. వైట్ హౌస్ లో మోడల్ హౌస్
అమెరికాలో 9/11 దాడుల వ్యూహకర్తలైన ఉగ్రవాదులను సీఐఏ అత్యంత పకడ్బందీగా ప్రణాళికలు రచించి మట్టుబెడుతోంది. తాజాగా తాలిబన్ల రాజ్యంలో అల్ఖైదా ఉగ్రనేత అల్ జవహరీని హతమార్చింది. దీనికోసం సీఐఏ సుదీర్ఘకాలంగా కాపు కాసింది. అత్యంత భారీ రక్షణ మధ్య ఉండే జవహరీ అడుగు బయట పెట్టడం కోసం ఎదురు చూసింది. దీనికి ఎంతో ఓపికపట్టింది. సమయం దొరకడంతో రహస్య ఆయుధంతో దాడిచేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే అక్కడి నుంచి డ్రోన్లు మాయమయ్యాయి. ఈ ఒక్క క్షణం కోసం అమెరికా 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తోంది.

రాత్రివేళ రెండు క్షిపణులతో దాడి
సీఐఏకు చెందిన డ్రోన్లు శనివారం రాత్రి అమెరికా కాలమాన ప్రకారం 9.48 గంటలకు అల్ఖైదా నేత జవహరీపై రెండు క్షిపణులతో దాడిచేశాయి. దాడి జరిగిన సమయంలో జవహరీ తన ఇంటి బాల్కనీలో నిలబడివున్నాడు. గతంలో పలుమార్లు అతను సీఐఏ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతడిని దృష్టిలో పెట్టుకొని సీఐఏ సుదీర్ఘ ప్రణాళికను రచించుకొని అమలు చేసింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ను మట్టుబెట్టిన తర్వాత 11 సంవత్సరాలకు జవహరీని మట్టుబెట్టింది. లాడెన్ హతమైన తర్వాత జవహరీ అల్ ఖైదా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత కొద్దినెలలకు అతడు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లడాన్ని సీఐఏ గుర్తించింది. కచ్చితంగా ఆ ప్రదేశం తెలియకపోవడంతో ఓపిక పట్టింది.

అనారోగ్యంతో మరణించారంటూ జరిగిన ప్రచారం
2020లో జవహరీ అనారోగ్యంతో మరణించినట్లు ప్రచారం జరిగింది. కానీ సీఐఏ నమ్మలేదు. ప్రచారం జరిగిన సంవత్సరం తర్వాత అమెరికాపై దాడులు జరిగి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జవమరీ మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. జెరూసలెంను ఎట్టి పరిస్థితుల్లో యూదులకు దక్కనీయమని ఆ వీడియలో జవహరీ చెప్పాడు. ట్విన్ టవర్ల దాడులను కొనియాడాడు. అతడు ఎక్కడ ఉన్నాడో సీఐఏకి సరైన క్లూ దొరకలేదు.

కాబూల్కు మకాం మార్చి..
వీడియో విడుదలైన ఏడు నెలల తర్వాత జవహరీ సమాచారం లభించడం ప్రారంభమైంది. భార్య, కుమార్తెలు కాబూల్లోని ఓ భవనంలో ఉన్నట్లు సీఐఏ ఉన్నతాధికారులు తెలుసుకున్నారు. ఆ ఇంట్లో జవహరీ ఉంటున్నట్లు నిర్థారించుకొని అలాంటి మోడల్ ఇంటిని అమెరికాలో తయారుచేశారు. దాన్ని వైట్ హౌస్ లో సిచ్యువేషన్ రూమ్కు తెచ్చారు. ప్రణాళిక ప్రకారం ఇంటివద్దే దాడిచేయాలని నిర్ణయించారు. అప్పుడప్పుడు జవహరీ బాల్కనీలో కూర్చుంటాడని నిఘా వర్గాలు గుర్తించాయి.

అతి కొద్దిమందికే తెలుసు..
ఈ ప్రణాళిక మొత్తం అత్యున్నత స్థాయి అధికారుల్లో అతి తక్కువ మందికే తెలుసు. నిఘా బృందంలో ఒక అధికారిని అతడి దినచర్యపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా నియమించారు. జులై 31వ తేదీన కాబూల్ లోని భవనంలో అల్ జవహరీ ఒంటరిగా బాల్కనీలో నిలబడి ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రత్యేక అధికారి ధ్రువీకరించారు. వెంటనే సీఐఏ డ్రోన్ రెండు హెల్ఫైర్ క్షిపణులను ప్రయోగించింది. జవహరీ హతమయ్యాడు. తాలిబన్ ప్రభుత్వం కూడా ఈ దాడిని ధ్రువీకరించింది.












Click it and Unblock the Notifications