తెలంగాణలో అనూహ్య మార్పులు..? ప్రభుత్వం మారబోతుంది: అమిత్ షా
బీజేపీ చూపు.. తెలుగు రాష్ట్రాలపై పడింది. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మినహా ఆ పార్టీ ప్రభావం చూపడం లేదు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు పరిస్థితి వేరు.. కానీ ఇక్కడ కూడా జెండా ఎత్తాలని చూస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం అని జోస్యం చెబుతూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో ప్రభుత్వం మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో ప్రభుత్వం మారబోతోందని షా జోస్యం చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమం, తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు కోసం ఏళ్లుగా ఉద్యమం జరిగింది. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ డిమాండ్ను కాంగ్రెస్ పట్టించుకోలేదు. 2014 ఎన్నికల కోసమే తెలంగాణను హడావిడిగా ప్రకటించారని అమిత్ షా ఆరోపించారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. తెలంగాణపై ఏనాడూ సవతి తల్లి ప్రేమ చూపించలేదన్నారు. ఏ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినా గౌరవిస్తామని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితో దేశం పురోగమిస్తుందని తాము నమ్ముతామని షా అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు.