ట్రంప్ కు చుక్కెదురు?
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది.

ఈ టారిఫ్ పై తాజాగా అమెరికా ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితులను ప్రకటించి, దాదాపు ప్రతి దేశంపై దిగుమతి పన్నులను విధించడం చట్టబద్ధంగా సరైంది కాదని స్పష్టం చేసింది. ఇవి చట్టవిరుద్ధమని పేర్కొంటూనే- అమెరికన్ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని ప్రస్తుతానికి కొనసాగించడానికి అనుమతించింది.
రెండు కేసులకు సంబంధించి ఫెడరల్ అప్పిలేట్ కోర్టు.. తాజా తీర్పు వినిపించింది. ఈ రెండింట్లో- మొదటిది రెసిప్రోకల్ టారిఫ్ కు సంబంధించినది కాగా- రెండోది 12 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దాఖలు చేసినది. రెండో కేసును ఒరెగాన్ అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ వాదించారు. అలాగే ఫిబ్రవరిలో చైనా, కెనడా, మెక్సికోలపై విధించిన టారిఫ్ ను కూడా ఆయన ప్రస్తావించారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ తన అధికారాన్ని ఉల్లంఘించారని డాన్ రేఫీల్డ్ తెలిపారు. 1977 నాటి IEEPA చట్టం- సాధారణంగా ఆంక్షలు, ఆస్తుల స్తంభనకు ఉపయోగిస్తారని గుర్తు చేశారు. దీన్ని ఉపయోగించి ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారని, టారిఫ్ విధించారని అన్నారు.
ఆయన వాదనలో న్యాయమూర్తులు ఏకీభవించారు. వాదనల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు అనేక చర్యలు తీసుకునే విచక్షణాధికారాలు చట్టపరంగా అధ్యక్షుడికి లభిస్తాయని ఇందులో టారిఫ్ విధించే అధికారంపై స్పష్టత లేదని అన్నారు. IEEPA చట్టంలో కూడా టారిఫ్ ప్రస్తావన లేదని పేర్కొన్నారు.
IEEPA చట్టం టారిఫ్లను విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వదని, ఈ చట్టం ద్వారా సుంకాలు విధించినట్లు వాదించడం సరికాదని అభిప్రాయపడింది. వాణిజ్య లోటు అనేది అత్యవసర ముప్పుగా పరిగణించట్లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు అమలును అక్టోబర్ 14 వరకు అప్పీల్ కోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లే అవకాశాన్ని కల్పించింది.
తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా విమర్శించారు. "ఇది దేశానికి పూర్తి విపత్తు" అవుతుందని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో అప్పీల్ కోర్టులను "తీవ్ర పక్షపాతపూరితం" అని విమర్శించారు. సుప్రీంకోర్టు తనకే అనుకూలంగా తీర్పు ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications