కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా.. కీలక మలుపు అంటున్న సైంటిస్టులు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నివారణకు మందును కనిపెట్టేందుకు సైంటిస్టులు పరిశోధనల్లో మునిగిపోయారు. వైరస్ పరిణామ క్రమం,వ్యాధి నిర్దారణ కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న డొహెర్టి ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించారు. కరోనా నివారణపై పోరాటంలో ఇది కీలక అడుగుగా నిలిచిపోతుందన్నారు.
కరోనా వైరస్ సోకిన ఓ పేషెంట్ నుంచి నమూనాలను సేకరించి వాటిని పరీక్షించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ల్యాబ్లో ఆ వైరస్ను వృద్ది చేయడం ద్వారా దాని పరిణామ క్రమాన్ని గుర్తించినట్టు వెల్లడించారు.చైనా వెలుపల కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించడం ఆస్ట్రేలియాలోనే మొదటిసారి అని చెబుతున్నారు. చైనాలోని ఓ ల్యాబ్లో కరోనా వైరస్ను వృద్ది చేసినప్పటికీ.. దాని నమూనాలను కాకుండా కేవలం జన్యుశ్రేణిని మాత్రమే విడుదల చేశారు. కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించడమంటే.. దాని ప్రత్యేక లక్షణాలను గుర్తించడమేనని డొహెర్టి ఇనిస్టిట్యూట్ ల్యాబోరేటరీ హెడ్ జూలియన్ డ్రూస్ తెలిపారు. తాము గుర్తించిన కరోనా పరిణామ క్రమ నమూనాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కి కూడా పంపిస్తామని చెప్పారు. తద్వారా కరోనా లక్షణాలను గుర్తించడం సులువవుతుందని తెలిపారు.

డొహెర్టి ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ మైక్ కాటన్ మాట్లాడుతూ.. తాజా పురోగతి ద్వారా కరోనా వైరస్ లక్షణాలు బయటపడని వ్యక్తుల్లోనూ ఆ వైరస్ ఉందో లేదో నిర్దారించవచ్చునని చెప్పారు. యాంటీ బాడీ టెస్ట్ ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. కాగా,ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెడికల్ యూనివర్సిటీలు,మెడికల్ కార్పోరేషన్స్,ప్రభుత్వాలు కరోనా వైరస్ను నియంత్రించే వ్యాక్సిన్ తయారీ కోసం పనిచేస్తున్నాయి.
Doherty Institute scientists first to grow and share novel #coronavirus. Announcement here: https://t.co/lMYExkWaDb @UniMelbMDHS @TheRMH @uommedia pic.twitter.com/NKrwPQGO5H
— Doherty Institute (@TheDohertyInst) January 28, 2020
ఇదిలా ఉంటే,చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 132 మంది చనిపోయినట్టు అధికారిక డేటా చెబుతోంది. అలాగే 5974 మందికి కరోనా సోకినట్టు,మరో 9329 అనుమానిత కేసులు నమోదైనట్టు చైనా వర్గాలు చెబుతున్నాయి. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉందని వుహాన్కి చెందిన ఓ నర్సు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చైనాలో ఇప్పటివరకు దాదాపుగా 90వేల మందికి కరోనా వైరస్ సోకినట్టుగా ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications