బైక్పై శవాన్ని ఊరేగించి!.. చూసినోళ్లంతా షాక్: బ్రెజిల్లో వింత ఘటన
తన సోదరుడిని మరిచిపోలేకే ఇలా చేయాల్సి వచ్చిందని రోసా చెప్పాడు. అదీగాక, ఓరోజు కలలో కనిపించి బైక్ పై తిరగాలని ఉందంటూ తన సోదరుడు కోరాడని తెలిపాడు.
బ్రెజిల్: రక్త సంబంధీకులెవరైనా హఠాత్తుగా చనిపోతే తట్టుకోవడం చాలా కష్టం. ఏళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని ఒక్కసారిగా తెంచేసుకోవాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. అలా అని విధి ముందు తలవంచక తప్పదు. దు:ఖాన్ని దిగమింగకుని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడమే తప్పితే.. అంతకుమించి చేసేదేమి ఉండదు.
కానీ బ్రెజిల్కు చెందిన ఓ వ్యక్తి విచిత్రంగా వ్యవహరించాడు. చనిపోయిన సోదరుడిని మరిచిపోలేక ఏకంగా అతని సమాధిని తవ్వి శవపేటికను బయటకు తీశాడు. ఆపై బైక్పై ఎక్కించుకుని ఊరేగించాడు. రోసా అనే ఓ వ్యక్తి చేసిన ఈ పనికి ఊరంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదే విషయం పోలీసులు చెవిన పడటంతో తమ వాహనాల్లో అతని బైక్ ను వెంబడించి పట్టుకున్నారు.
తన సోదరుడిని మరిచిపోలేకే ఇలా చేయాల్సి వచ్చిందని రోసా చెప్పాడు. అదీగాక, ఓరోజు కలలో కనిపించి బైక్ పై తిరగాలని ఉందంటూ తన సోదరుడు కోరాడని తెలిపాడు. అందువల్లే సమాధిని తవ్వి తన సోదరుడి శవపేటికను బైక్ పై ఊరేగించానని చెప్పుకొచ్చాడు. పోలీసులు రోసాపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
కాగా, శవపేటికను బైక్ పై ఊరేగిస్తున్న సమయంలో కొంతమంది ఫోటోలు కూడా తీశారు. అవి కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.