పాకిస్థాన్లో కాల్పులు: చైనీయుడు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, డ్రాగన్ వార్నింగ్
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో రద్దీగా ఉండే మార్కెట్లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఒక చైనా జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, దుండగులు డెంటల్ క్లినిక్ లోపల కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని, మరో ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ముగ్గురూ చైనా జాతీయులు కావడం గమనార్హం.
బాధితులను 25 ఏళ్ల రోనిల్డి రైమండ్ చా, 72 ఏళ్ల మార్గ్రేడ్, 74 ఏళ్ల రిచర్డ్గా పోలీసులు గుర్తించారు. తాజాగా ఘటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు సహించబోమని హెచ్చరించింది.
పాకిస్థాన్లో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో ఇది తాజా ఘటన. ఈ ఏడాది ఏప్రిల్లో యూనివర్శిటీ ఆఫ్ కరాచీ (కేయూ) కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ ప్రధాన ద్వారం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులు మరణించారు.
కేయూ ఆత్మాహుతి దాడి తర్వాత చైనా ఇస్లామాబాద్కు గట్టి హెచ్చరిక చేసింది. "చైనీయుల రక్తాన్ని వృధాగా చిందించలేము, ఈ సంఘటన వెనుక ఉన్నవారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.
నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) లింక్డ్ మజీద్ బ్రిగేడ్.. కరాచీ విశ్వవిద్యాలయంలో చైనా-నిర్మిత కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ (స్థానిక విద్యార్థులకు చైనీస్ భాషను బోధించే లాభాపేక్షలేని సంస్థ) సమీపంలో జరిగిన దాడికి బాధ్యత వహించింది.