బోరున ఏడ్చిన క్లింటన్ మద్దతుదారులు, ట్రంప్ వర్గం సంబరం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమి చవి చూశారు. ఆమె ఓడిపోవడం జీర్ణించుకోలేక పలువురు మద్దతుదారులు బోరున విలపించారు. మన్హటన్లోని జేకబ్ కే జవిట్స్ సెంటర్లో హిల్లరీ మద్దతుదారులు కన్నీరు పెట్టుకున్నారు.
మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు తీర్పు వెల్లడి కాకుండానే డైట్ కోక్లు, కాఫీలు తాగుతూ సంబరాల్లో మునిగిపోయారు.
కాగా, అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోని ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీకి అవసరమైన 270 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అనూహ్య పరాజయాన్ని చవిచూశారు.
ఇదిలా ఉండగా హిల్లరీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అమెరికాలో గత రెండు పర్యాయాలుగా అధికారంలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉండటం, అమెరికాలో 1945 అనంతరం ఒక పార్టీ వరుసగా రెండుసార్ల కంటే ఎక్కువగా ఎప్పుడూ గెలుపొందలేదని చెబుతున్నారు.
శ్వేతజాతీయులు ట్రంప్కు మద్దతు పలికారు. అందుకు ఆయన ఉద్యోగ హామీ తదితరాలు కారణమని చెబుతున్నారు. ఆర్థిక విధానాల్లో హిల్లరీ తన విధానాలను ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లలేకపోయారని చెబుతున్నారు. ట్రంప్ వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు తీసుకొస్తానని అందర్నీ ఒప్పించారంటున్నారు. చివరలో ఈ మెయిల్ అంశం కూడా ఆమెకు షాక్ ఇచ్చింది.