భారత్లో ఏం జరుగుతుందో మేం గమనిస్తున్నాం: ఇస్లామిక్ కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్నామని ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్(ఓఐసీ) ప్రకటించింది.
బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం లాంటి అంశాలను పరిశీలిస్తున్నామని పేర్కొంది.
భారతదేశంలోని ముస్లిం ప్రార్థన స్థలాలను, మైనార్టీల రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. ఐక్యరాజ్యసమితి సూత్రాలు, అంతర్జాతీయ కన్వెన్షన్ల ప్రకారం మైనార్టీలపై ఎలాంటి వివక్షా చూపరాదని పేర్కొంది.
ఇలాంటి చర్యలు ఆ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని పేర్కొంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో వివక్షను, హింసను ఎదుర్కొని మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, తదితర మైనార్టీ వర్గాలకు చెందినవారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం.
పౌరసత్వ సవరణ చట్టం కారణంగా దేశంలోని ఏ భారతీయుడికీ నష్టం లేదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చట్టం కేవలం విదేశాల నుంచి వచ్చే శరణార్థులకు సంబంధించినదని, దీంతో దేశంలోని ఏ పౌరుడికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారాలు చేస్తూ దేశ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications