Covaxin: భారత్ బయోటెక్కు ఎదురుదెబ్బ: ఆ వినియోగానికి అమెరికా రెడ్ సిగ్నల్
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వినియోగాన్న అగ్రరాజ్యం అమెరికా తిరస్కరించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ యాజమాన్యం దాఖలు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వడానికి నిరాకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. చాలా ఆలస్యంగా దరఖాస్తులు చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
Recommended Video
Rohini Sindhuri biopic: తెలుగు ఐఎఎస్ అధికారిణిపై మూవీ: బిగ్బాస్ కంటెస్టెంట్ లీడ్ రోల్
అమెరికాలో కోవాగ్జిన్ వినియోగానికి భారత్ బయోటెక్ యాజమాన్యం.. అమెరికన్ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆక్యుజెన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాలో కోవాగ్జిన్ దిగుమతి చేసుకోవడం మొదలుకుని.. దాన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగించేంత వరకు అవసరమైన కార్యకలాపాలన్నింటినీ ఆక్యుజెన్ పర్యవేక్షిస్తుంది. తెలుగువాడైన శంకర్ ముసునూరి స్థాపించిన ఫార్మా కంపెనీ ఇది.
అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రెండు టీకాలను వినియోగిస్తోందక్కడి ప్రభుత్వం. ఫైజర్, మోడెర్నా వినియోగంలో ఉన్నాయి. దీనికి అదనంగా కోవాగ్జిన్కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరఫున ఆక్యుజెన్.. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకుంది. వాటిని పరిశీలించిన తరువాత మరింత అదనపు సమాచారం ఇవ్వాలని యూఎస్ఎఫ్డీఏ ఆదేశించింది. దీన్ని సకాలంలో దాఖలు చేయకపోవడం వల్లే అనుమతి నిరాకరించినట్లు చెబుతున్నారు.
అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజికల్ లైసెన్స్ అప్రూవల్ కోసం కోవాగ్జిన్కు సంబంధించిన మాస్టర్ ఫైల్ను అందజేయాల్సి ఉంటుందంటూ ఎఫ్డీఏ సూచించినట్లు ఆక్యుజెన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శంకర్ ముసునూరి తెలిపారు. ఈ మేరకు న్యూయార్క్లో ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత కీలకమైన మూడోదశకు చెందిన క్లినికల్ ట్రయల్స్ను భారత్ బయోటెక్ యాజమాన్యం ప్రకటించట్లేదంటూ భారత్లోనూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జులైలో తాము ఈ నివేదికను బహిర్గతం చేస్తామంటూ యాజమాన్యం ప్రకటించింది.