పాక్ కు కార్గో విమానంలో చైనా ఆయుధాలు ? డ్రాగన్ ఆర్మీ క్లారిటీ..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం కోసం భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ ప్లాన్ చేసింది. దీంతో పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. తన చిరకాల మిత్రదేశం చైనాను సాయం కోరింది. దీంతో చైనా కార్గో విమానంలో భారీ ఎత్తున సైనిక సామాగ్రిని పాకిస్తాన్ కు పంపినట్లు ప్రచారం జరిగింది. దీంతో చైనా ఇచ్చిన ఆయుధాలు, మిస్సైళ్లు, జెట్ల సాయంతో భారత్ పై దాడి చేసిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా ఇవాళ స్పందించింది.
భారత్ పై దాడికి పాకిస్తాన్ కు కార్గో విమానంలో సైనిక సామాగ్రి పంపారన్న వార్తలపై ఇవాళ చైనా సైన్యం లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. ఇది కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది. చైనా రక్షణశాఖ వెబ్ సైట్లో కూడా తాము అలాంటి ఏ మిషన్ ఏదీ చేపట్టలేదని క్లారిటీ ఇచ్చింది. చైనాకు చెందిన వై20 కార్గో విమానంలో పాకిస్తాన్ కు సైనిక సామాగ్రి పంపామన్న వార్తల్ని రక్షణశాఖ తోసిపుచ్చింది.

అంతే కాదు చైనాపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్మీ హెచ్చరించింది. ఇంటర్నెట్ అనేది చట్టానికి అతీతం ఏమీ కాదని తేల్చిచెప్పింది. తమ సైన్యానికి వ్యతిరేకంగా వార్తలు వండి వారిస్తే చట్టపరంగా శిక్షిస్తామని ప్రకటించింది. అలాగే ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిపింది. చైనా అన్ని తీవ్రవాదాలకూ వ్యతిరేకమని తెలిపింది. దీంతో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించిన చైనా సైనిక సామాగ్రి మాత్రం పంపలేదని క్లారిటీ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications