కలల ప్రపంచంలో కల్లోలం: డిస్నీల్యాండ్ సంక్షోభ ఊబిలో: ఒకేసారి 28 వేల మంది ఉద్యోగులపై వేటు
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్.. డిస్నీల్యాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. కరోనా వైరస్ ప్రభావం డిస్నీ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. ఏడాది పొడవునా సందర్శకులతో క్రిక్కిరిసిపోయే డిస్నీ.. ఏడెనిమిది నెలలుగా బోసిపోయింది. కరోనా వైరస్ వల్ల సందర్శకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. భౌతిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల సందర్శనకు వస్తోన్న వారి సంఖ్యలోనూ భారీగా తగ్గదల నమోదవుతోంది.
షటప్ మ్యాన్: ట్రంప్ ఫైర్: ఒబామా కేర్పై వాడివేడిగా ట్రంప్-బిడెన్ మధ్య డిబేట్: భారత్ ప్రస్తావన
ప్రధాన ఆదాయ వనరులపై దెబ్బ..
డిస్నీల్యాండ్ ప్రధాన ఆదాయ వనరు థీమ్ పార్క్, రిసార్టులు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ రెండూ దారుణంగా దెబ్బతిన్నాయి. సందర్శకులు లేక చాలాకాలం నుంచి బోసిపోయాయి. మరోవంక- నిర్వహణ భారం పెరగడం, ఉద్యోగులకు వేతనాల చెల్లించాల్సి రావడంతో డిస్నీల్యాండ్ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నిర్వహణ వ్యయం తడిసి మోపెడైంది. ఫలితంగా- వేలాదిమంది ఉద్యోగులపై వేటు వసింది.
28 వేల మంది ఉద్యోగుల తొలగింపు..
28 వేల మంది ఉద్యోగులను తొలగించింది డిస్నీల్యాండ్ యాజమాన్యం. లేఆఫ్ను ప్రకటించింది. అమెరికాలోని పలు నగరాల్లో డిస్నీల్యాండ్ థీమ్ పార్కులు, రిసార్టులు.. ఇతర మనోరంజక కేంద్రాలు ఉన్నాయి. లక్షమందికి పైగా ఉద్యోగులు డిస్నీల్యాండ్ సంస్థలో పనిచేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచీ సందర్శకుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. అమెరికన్లు థీమ్ పార్కులను సందర్శిచడానికి ఆసక్తి చూపట్లేదు. విదేశీ పర్యాటకుల సంఖ్య జీరో స్థాయికి పడిపోయింది.
దారుణంగా పడిపోయిన పర్యాటకుల సంఖ్య..
సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల విదేశీయులెవరూ అమెరికాలో అడుగు పెట్టట్లేదు. పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది. దీని ప్రభావం డిస్నీల్యాండ్పై పడింది. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయింది. దీన్ని నివారించడానికి ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఒకేసారి 28 వేల మందిపై వేటు వేసింది. తొలగించిన వారిలో మూడొంతుల మంది పార్ట్ టైమ్ ఉద్యోగులేనని డిస్నీ థీమ్ పార్క్ యూనిట్ ఛైర్మన్ జాష్ డీ యామరో తెలిపారు.
రీఓపెన్ చేసినా..
భౌతిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల పరిమితంగా డిస్నీల్యాండ్ థీమ్ పార్క్లోకి సందర్శకులను అనుమతిస్తున్నామని, ఫలితంగా రోజువారీ ఆదాయం గణనీయంగా తగ్గిందని అన్నారు. రిసార్టుల కార్యకలాపాలు కూడా పరిమితంగా సాగుతున్నట్లు చెప్పారు. కాలిఫోర్నియాలోని థీమ్ పార్కులన్నీ మూసే ఉన్నాయని చెప్పారు. ఫ్లోరిడాలోని పార్కులను పునరుద్ధరించినప్పటికీ.. సందర్శకుల సంఖ్య నామమాత్రంగా ఉంటోందని అన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి 28 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, ఇందులో మూడొంతుల మంది పార్ట్ టైమర్లేనని తెలిపారు.
Recommended Video
ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో బిలియన్ డాలర్లు..
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో థీమ్ పార్క్ డివిజన్ బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసినట్లు జాష్ తెలిపారు. కరోనా వైరస్ వల్ల.. ముందుగా నమోదైన బుకింగ్స్లను రద్దు చేశామని పేర్కొన్నారు. జులైలో కొన్ని నగరాల్లో థీమ్ పార్కులను పునరుద్ధరించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో సందర్శకుల సంఖ్య నమోదు కావట్లేదని చెప్పారు. ప్రత్యేకించి- విదేశీ పర్యాటకులెవరూ ఈ మధ్యకాలంలో థీమ్ పార్కులను సందర్శించడానికి రాలేదని అన్నారు. అమెరికాలో స్థిరపడిన విదేశీయులే తప్ప.. బయటి నుంచి వచ్చిన వారి సంఖ్య నామమాత్రంగా కూడా లేదని చెప్పారు.