సిరిసేనకు షాక్: పార్లమెంటు రద్దు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు
గత కొద్దిరోజులుగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనకు షాకిస్తూ తీర్పు చెప్పింది ఆ దేశ సుప్రీంకోర్టు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడం రాజ్యాంగానికి విరుద్ధమంటూ పేర్కొంటూ తీర్పు వెలువరించింది శ్రీలంక సర్వోన్నత న్యాయస్థానం. ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకపక్షంగా తీర్పును వెల్లడించింది. నాలుగున్నరేళ్లు పదవీకాలం పూర్తి కాకుండానే అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేయడానికి వీలులేదని అభిప్రాయపడింది. తీర్పు వెలువరిస్తున్న సమయంలో కోర్టు ప్రాంగణం అంతా భద్రతాదళాల అదుపులోకి వెళ్లింది.
అక్టోబర్ 26న ఆదేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేను తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిసేన ప్రకటించడంతో అటు రాజ్యాంగపరంగా ఇటు రాజకీయపరంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. అంతేకాదు ఆదేశ మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సేను ప్రధానిగా నియమించడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 225 సీట్లున్న పార్లమెంటును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది పరిస్థితి. అయితే పార్లమెంటు సమావేశం అయిన సమయంలో మహింద రాజపక్సేకు 113 మంది ఎంపీల మద్దతు లభించకపోవడంతో ఆయన్ను ప్రధానిగా దించివేయడం జరిగింది.మరోవైపు విక్రమసింఘేకు కావాల్సిన సంపూర్ణ మద్దతు ఎంపీల నుంచి ఉంది.
బుధవారం పార్లమెంటులో విక్రమసింఘేకు 117 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. దీంతో ఆయన బలపరీక్షలో నెగ్గారు. అదే రాజపక్సే బలనిరూపణలో విఫలమయ్యారు. ఇదిలా ఉంటే దేశ ప్రయోజనాలు అక్కడి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పార్లమెంటును రద్దు చేసినట్లు అధ్యక్షుడు సిరిసేన అన్నారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 9న పార్లమెంటు రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించగానే శ్రీలంక సుప్రీంకోర్టులో దాదాపే 13 పిటిషన్లు దాఖలయ్యాయి. రాజపక్సేను ప్రధానిగా చేయాలన్న ఆంక్షతో పనిచేసి విఫలమైన సిరిసేనకు కోర్టు తీర్పు మరో షాక్ అనే చెప్పాలి. కోర్టు తీర్పు ఇవ్వడంతో ఫిబ్రవరి 2020 వరకు దేశంలో పార్లమెంటు ఎన్నికలకు ఆస్కారం లేనట్టే.