కరోనా: అమెరికాపై WHO సంచలనం.. మారకుంటే శవాల గుట్టలే గతి.. ట్రంప్ వల్లే 15వేల మంది బలి
గ్లోబల్గా 15లక్షల మందికిపైగా సోకిన కరోనా వైరస్.. సుమారు 90వేల మందిని బలితీసుకుంది. దాదాపు 200 దేశాల ఆర్థిక వ్యవస్థల్నికుదిపేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చాలా రోజుల కిందటే కరోనాను మహమ్మారి(పాండమిక్)గా ప్రకటించింది. చంపుకుతినడం, అతలాకుతలం చేయడంతోపాటు కరోనా లాంటి 'పాండమిక్'లకు మరో ప్రధాన లక్షణం ఉంటుంది. అది అందర్నీ 'పానిక్'కు గురిచేస్తుంది. అంటే, మానవజాతి మొత్తాన్నీ తీవ్రభయాందోళనలోకి నెట్టేస్తుంది. అదిగో, ఈ విపత్కర పరిస్థితుల్లోనే పాలకులు.. ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పాలి. పానిక్ అయిపోవద్దని భరోసా కల్పించాలి. మెజార్టీ దేశాల్లో అదే జరుగుతున్నా.. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఒకింత విత పరిస్థితులు నెలకొన్నాయి.

ట్రంప్ వార్నింగ్పై WHO స్పందన
గురువారం ఉదయం నాటికి అమెరికాలో కొవిడ్-19 రోగుల సంఖ్య 4.35లక్షలకు పెరిగింది. అతి విషాదకరంగా అందులో 15వేల మంది చనిపోయారు. కోలుకున్న వాళ్ల సంఖ్య కేవలం 23వేలే. ఇవాళ్టికీ క్రిటికల్ కండిషన్ లో మరో 10 వేల మంది ఉన్నారు. మరణాల్లో ఇప్పటికే స్పెయిన్ ను దాటేసిన అమెరికా.. ఒకటి రెండు రోజుల్లో ఇటలీని కూడా క్రాస్ చేసే అవకాశాలు లేకపోలేదు. కాగా, అమెరికాలో కరోనా విలయానికి WHOనే కారణమని, అది చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రపంచ దేశాలను మోసం చేస్తున్నదని, అలాంటి మోసకారి సంస్థకు అమెరికా నిధులు ఇవ్వబోదని ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సదరు విమర్శలపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రేయేసస్ కూడా ఘాటుగా స్పందించారు.

శవాలే మిగులుతాయ్..
‘‘సమర్థవంతమైన పాలకుడిగా మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు చాలా అవకాశాలొస్తాయి. ఇదొక ప్రత్యేక సందర్భం. ప్రపంచంలోని రాజకీయ పార్టీలన్నీ సిద్ధాంతాలు, ఆలోచనలు, భిన్నభావాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలబడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కరోనా విలయం కొనసాగినంత కాలం రాజకీయాలను ‘ఐసోలేషన్'లో ఉంచాలి. అలా కాకుండా, కొవిడ్-19పై రాజకీయాలే చేస్తామని ఎవరైనా భావిస్తే.. అది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. వాళ్ల దేశాల్లో శవాలను భ్రపరిచే బ్యాగుల సంఖ్య పెరగడం తప్ప, మంచి ప్రయోజనమంటూ ఉండదు. కాబట్టి కరోనా వైరస్ పై దయచేసి రాజకీయాలు చేయకండి..'' అని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. బుధవారం జెనీవాలోని ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే గట్టి చురకలువేశారు.

నిప్పుతో చెలగాటం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది భూమీదున్న ప్రతి వ్యక్తినీ సమానంగానే చూస్తుందని, జాతి, వర్ణ, మత, ప్రాంతీయ భేదాలు ఉండవని, అన్ని దేశాలకూ ఆత్మీయ సేవల్ని అందిస్తామని టెడ్రోస్ అథనోమ్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జాతీయ సమైక్యతతోపాటు ప్రపంచ సంఘీభావం అనే రెండు భావాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. ఐక్యమత్యంగా ఉంటేనే వైరస్ బారి నుంచి మానవాళిని కాపాడుకోగలమని, ఇందులో కొన్ని దేశాలు తక్కువ, ఇంకొన్ని ఎక్కువ అనే భావన ఉండరాదని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం నిప్పుతో చెలగాటం లాంటిదేనని, అది ప్రమాదానికి దారితీస్తుందేతప్ప మంచి ఫలితాలు ఇవ్వదని టెడ్రోస్ తెలిపారు.

WHOను బలిపశువుగా..
అమెరికా ప్రెసిడెంట్ విమర్శలకు ధీటుగా బదులిచ్చిన ప్రంపంచ ఆరోగ్య సంస్థ.. తన ప్రతిస్పందనలో ఎక్కడా ట్రంప్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే అమెరికాలో కరోనా కట్టడిలో ఘోరంగా ఫెయిలైన డొనాల్ట్ ట్రంప్.. ఆ నెపాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని బలిపశువుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కరోనా విషయంలో బిల్ గేట్స్ లాంటి ప్రముఖులెందరో ట్రంప్ తీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ వచ్చారు. కొవిడ్-19 కేసుల సంఖ్య లక్షల్లోకి పెరిగిన తర్వాత కూడా ట్రంప్ దేశవ్యాప్త లాక్ డౌన్ కు ఆదేశించకపోవడం విమర్శలకు తావిచ్చినట్లయింది. అలాగే,

తప్పు చేసి డ్రామాలా?
కరోనా విషయంలో ముందస్తుగా హెచ్చరించలేదని, కొన్ని నిర్ణయాలను నిరాకరించిందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. WHOను నిందించారు. చైనాలోని వూహాన్ లో లాక్ డౌన్ ప్రకటించిన రోజుల్లోనే.. అమెరికాకు వచ్చే విదేశీ విమానాలను నిషేధించాలనుకున్నానని, అయితే అలా చెయ్యొద్దని WHO చెప్పడం వల్లే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాననని, ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా తయారుకావడానికి WHOనే కారణమని ట్రంప్ ఆరోపించారు. అయితే, వాస్తవం మరోలా ఉందని, జనవరి చివరి వారంలోనే అన్ని దేశాలకు WHO ప్రమాద హెచ్చరికలు జారీచేసిందని, ఆ టైమ్ లో ట్రంప్ ‘అమెరికాకు ఏం కాదు, అంతా మంచే జరుగుతుంది'అని పదే పదే భరోసా కల్పించే ప్రయత్నం చేశాడని, తీరా కొపలు మునిగిన తర్వాత తప్పును WHOపైకి నెట్టే ప్రయత్నం చస్తున్నాడని ప్రపంచ ప్రఖ్యాత పత్రికల్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications