ట్రంప్ తగ్గట్లేదు: సౌదీ టూర్లోనూ అదే మాట- భారత్కు తలనొప్పి
US President Donald Trump: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. రెండు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగాయి. డ్రోన్లు, మిస్సైళ్లను సంధించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి.
పహల్గామ్లో చోటు చేసుకున్న మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వాటిపై భారీగా దాడులు చేపట్టింది. 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై వైమానిక దాడులు సాగించింది భారత్. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై పాతుకుపోయిన ఉగ్రవాద సంస్థలను పెకిలించివేసింది.

భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని, దీనితో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని ఆయన చెప్పుకొన్నారు.
ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం ఆయన సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. సౌదీ- యూఎస్ ఇన్వెస్టిమెంట్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విదేశీ పర్యటనకు రావడం డొనాల్డ్ ట్రంప్కు ఇదే తొలిసారి.
సౌదీ- యూఎస్ ఇన్వెస్టిమెంట్ ఫోరం సదస్సులో ట్రంప్ ప్రసంగించారు. భారత్- పాకిస్థాన్ యుద్ధం, పరస్పర దాడుల గురించి ప్రస్తావించారు. యుద్ధం వల్ల సంభవించే దుష్పరిణామాల గురించి వివరించారు. యుద్ధం కంటే చర్చలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనీ చెప్పుకొచ్చారు. యుద్ధ నివారణ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు.
భారత్- పాకిస్థాన్ యుద్ధానికి తానే అడ్డుకట్ట వేశానని డొనాల్డ్ ట్రంప్ పురుద్ఘాటించారు. దీనితో గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టయింది. ఈ వ్యాఖ్యలకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ దీన్ని ఆయన పెద్దగా పరిగణనలోకి తీసుకోనట్టుగానే కనిపించారు.
భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా తాను చర్యలు తీసుకున్నానని, ఇది చారిత్రాత్మక ఘట్టమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కుదుర్చుకోవడానికి వాణిజ్యాన్ని ఉపయోగించానని, దీనితో తన అభిప్రాయాలను అంగీకరించారని, ఏకీభవించారని ట్రంప్ వివరించారు.
కాల్పుల విరమణ చర్చల్లో మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలకంగా వ్యవహరించారని ట్రంప్ చెప్పారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగివుంటే- లక్షలాదిమంది జనం మరణించడానికి కారణం అయ్యేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications