NEET: ఇదెక్కడి మాస్ కాపీయింగ్ బ్రో! వాష్ రూమ్ వెంటిలేటర్ టు ఫ్లష్ ట్యాంక్..
ఆశావహుల భవితవ్యాన్ని తేల్చే నీట్ (NEET) రీ-ఎగ్జామ్ అది. దేశవ్యాప్తంగా కంటిమీద కునుకు లేకుండా చదివిన విద్యార్థులు పరీక్ష హాల్లో టెన్షన్ టెన్షన్గా గడుపుతున్నారు. బయట గట్టి పోలీస్ బందోబస్తు, లోపల ఇన్విజిలేటర్ల డేగ కళ్లు.. ఎక్కడ చూసినా ముమ్మర తనిఖీలు. కానీ, ఆ పరీక్షా కేంద్రంలో మాత్రం ఓ విద్యార్థి సినిమా సీన్ను తలపించేలా పక్కా ప్లాన్తో రంగంలోకి దిగాడు. చివరికి ఇన్విజిలేటర్ల చాకచక్యంతో వాష్రూమ్లోనే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రంలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది.
ఉదయమే స్కెచ్.. పోలీసుల కళ్లు గప్పి ఊహించని ప్లాన్!
తెలంగాణలోని అచ్చంపేటకు చెందిన ఓ విద్యార్థి ఎలాగైనా నీట్ పరీక్షలో పాస్ అవ్వాలని ఒక వింతైన, సాహసోపేతమైన ప్లాన్ వేశాడు. ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభానికి చాలా ముందే.. అంటే సుమారు 7 గంటల ప్రాంతంలోనే రాగన్నగూడ జిల్లా పరిషత్ హైస్కూల్ కేంద్రానికి చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా కాంపౌండ్ వాల్ పక్కన ఉన్న వాష్రూమ్ వెంటిలేటర్ గుండా ఒక మొబైల్ ఫోన్ను లోపల దాచేశాడు.

ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ గేటు వద్ద భద్రతా సిబ్బంది నిర్వహించిన రెండు రౌండ్ల కఠినమైన ఫ్రిస్కింగ్, తనిఖీలను విజయవంతంగా దాటుకుని లోపలికి ప్రవేశించాడు. పరీక్ష ప్రారంభమయ్యాక, ఉదయం 11 గంటల సమయంలో నెమ్మదిగా వాష్రూమ్లోకి వెళ్లాడు. వెంటిలేటర్ దగ్గర దాచిన ఫోన్ను తీసి, ఒక జిప్ లాక్ కవర్లో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లష్ ట్యాంక్లో దాచిపెట్టి మళ్లీ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు.
'కడుపునొప్పి' నాటకం.. ఫ్లష్ ట్యాంక్ వెనుక అసలు రహస్యం!
పరీక్ష రాస్తూ రాస్తూ మధ్యలో సదరు విద్యార్థి తనకు విపరీతమైన కడుపునొప్పి వస్తోందంటూ ఇన్విజిలేటర్ల ముందు విలవిల్లాడిపోయాడు. వాష్రూమ్కి వెళ్లాలని బతిమాలడంతో అధికారులు మానవతా దృక్పథంతో అనుమతించారు. కానీ, లోపలికి వెళ్లిన విద్యార్థి ఎంతసేపటికీ బయటకు రాలేదు. టైమ్ అయిపోతున్నా లోపలే ఉండిపోవడంతో ఇన్విజిలేటర్కు గట్టి అనుమానం వచ్చింది.
వెంటనే అక్కడి సిబ్బందిని వాష్రూమ్ వైపు పంపించారు. లోపల ఏం జరుగుతుందోనని సిబ్బంది వెళ్లి చూడగా.. అక్కడ అసలు దృశ్యం బయటపడింది. ఆ విద్యార్థి ఫ్లష్ ట్యాంక్లో దాచిన ఫోన్ తీసి, గూగుల్ క్రోమ్లో నీట్ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు.
రంగంలోకి పోలీసులు..
సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు తక్షణమే పరీక్షా కేంద్రానికి చేరుకుని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ను పరిశీలించగా, అందులో కేవలం సాధారణ సోషల్ మీడియా యాప్స్ మాత్రమే ఉన్నాయని, గూగుల్ క్రోమ్ హిస్టరీలో పరీక్షకు సంబంధించిన సమాధానాల కోసమే వెతికినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల విచారణలో ఆ విద్యార్థి తప్పు చేసినట్లు అంగీకరించాడు.
తీవ్రమైన సెక్షన్ల కింద కేసు:
పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిబట్ల పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 318(4)తో పాటు, పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం "పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024" లోని సెక్షన్ 10, సెక్షన్ 3 కింద అత్యంత కఠినమైన కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఈ ప్లాన్లో అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. చదువుతో సాధించాల్సింది పోయి, ఇలాంటి అడ్డదారులు తొక్కి భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications