"మీ ఎమ్మెల్యే అవినీతి ఇదిగో-చంద్రబాబూ ఇక మీ ఇష్టం.."- బాలినేని..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. అధికార పార్టీ కేవలం టీడీపీయే, మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ మాత్రం విపక్షంలో ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అధికార పార్టీగా టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే.. తమకు ఏమాత్రం అవకాశం దక్కడం లేదన్న అసంతృప్తి జనసేన, బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) తాజా విమర్శలు చూస్తే మాత్రం ఇదే నిజమని అనిపించకమానదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ (Damacharla Janardhan) కూ, కాంగ్రెస్, వైసీపీల్లో పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో రాజకీయ ప్రత్యర్దులుగా ఉన్నారు. అయితే గత ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలోకి వచ్చిన బాలినేని.. గతంలోలాగే మిత్రపక్షం టీడీపీ ఎమ్మెల్యే అయిన దామచర్లపై విమర్శలు కొనసాగిస్తున్నారు. దీనిపై అధిష్టానాల వద్ద ఫిర్యాదులు ఉన్నా ఏమీ చేయలేని పరిస్ధితి. ఇదే క్రమంలో తాజాగా బాలినేని మరోసారి దామచర్లపై విమర్శలకు దిగారు. తన అనుచరులపై కేసులు పెడుతున్నారని, తప్పు చేయని తన వాళ్లను రక్షించుకోకపోతే ఇక రాజకీయాలు ఎందుకని బాలినేని ప్రశ్నించారు.

డ్వాక్రా రుణాల్లో ఎమ్మెల్యే పిఏ కను సన్నల్లో అవినీతి జరిగిందని బాలినేని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక డంప్ ద్వారా రూ. లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. రాజుపాలెంలో వందల ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేశారన్నారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల అరాచకాలు బాగా పెరిగాయని, నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లుగా దామచర్ల వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. దామచర్లతో టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు దర్యాప్తులు చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని బాలినేని తెలిపారు.




Click it and Unblock the Notifications