రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!
మన దేశంలో రైలు ప్రయాణాలకు అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ బుకింగ్ వ్యవస్థ (Passenger Reservation System) ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా ప్రయాణికులు మాత్రం దీనిపై అసంతృప్తిగానే ఉంటారు. దీనికి ప్రధాన కారణం సమయానికి తగిన రైళ్లు అందుబాటులో ఉన్నా, తగినన్ని టికెట్లు ఉన్నా, అవి మాత్రం ఇతరత్రా సమస్యలతో బుక్ కాకపోవడమే. దీంతో పాటు దళారులు అడ్డదారుల్లో టికెట్లను కొల్లగొట్టేస్తుండటం కూడా మరో ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS)లో రైల్వే మరిన్ని మార్పులు చేస్తోంది.
రైలు టిక్కెట్ల బుకింగ్ను ఆధునికీకరించడానికి, ప్రయాణీకులకు రిజర్వేషన్లను వేగవంతంగా, మరింత సౌకర్యవంతంగా చేయడానికి రైల్వే (Indian railways) మరో కొత్త వ్యవస్ధ తీసుకొస్తోంది. 1986 నుంచీ రైలు ప్రయాణికులకు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. అప్పటి నుండి ఆన్లైన్, మొబైల్ టిక్కెట్ బుకింగ్ లు ఇందులోనే జరుగుతున్నాయి. అయితే 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థను ఇప్పుడు అప్ గ్రేడ్ చేయాలని రైల్వే నిర్ణయించింది. కొత్త వ్యవస్థకు దశలవారీగా మారే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని రైల్వే బోర్డు పబ్లిక్ రిలేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ధర్మేంద్ర తెవారీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తెలిపారు.

కొత్తగా ప్రారంభించిన IRCTC బీటా వెబ్సైట్ ఈ మార్పులో భాగమే అన్నారు. పాత రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా తీసేసే ముందు, కొత్త వ్యవస్థను వివిధ దశల్లో లోడ్ ఆధారంగా పరీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ను ఉపయోగించే ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నందున, వాటిని తట్టుకునే వేగవంతమైన వ్యవస్థ అవసరం. అందుకే ఈ మార్పులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలోనే 65.08 కోట్ల రిజర్వ్డ్ టిక్కెట్లను ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. వీటిలో 57.90 కోట్ల టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేశారు. జూలై 15న తమ బీటా వెబ్సైట్ను ప్రారంభించాక టిక్కెట్ బుకింగ్ వేగం పెరిగిందని IRCTC చెబుతోంది. ప్రస్తుత వ్యవస్థలో నిమిషానికి 32వేల టికెట్ బుకింగ్లు జరుగుతుండగా, అప్గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షలకు పైగా టికెట్ బుకింగ్లు జరిగే అవకాశం ఉంది.




Click it and Unblock the Notifications