ఏపీ సర్కార్ పై ఉద్యోగుల జీతాల భారమెంత ? కాగ్ లెక్క ఇదే..!
ఏపీలో ఉద్యోగుల జీతాలకే (employees salaries) రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 98 శాతం ఖర్చయిపోతోందని తాజాగా ఆర్దిక శ్వేతపత్రం విడుదల సందర్బంగా సీఎం చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వాటా ఈ స్ధాయిలో ఉందా అని జనం ముక్కున వేలేసుకున్నారు. కానీ ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం కాగ్ లెక్కలే. కాగ్ (CAG) లెక్కల ప్రకారం కేవలం 30-40 మధ్యే ఉన్న తమ జీతాల భారాన్ని చంద్రబాబు తప్పుగా చూపించారనేది ఉద్యోగుల వాదన. ఇంతకీ కాగ్ లెక్కలు ఏం చెప్తున్నాయో చూద్దాం..
ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా వెల్లడించిన కాగ్ లెక్కల ప్రకారం 2025-26లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.2.26 లక్షల కోట్లు అని, ఇందులో ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ఖర్చు చేసింది కేవలం రూ.84,401 కోట్లు మాత్రమే అన్నారు. అంటే ఇది కేవలం 37 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పన్నుల ఆదాయం చూస్తే లక్షా 42 వేల కోట్లు ఉందని, ఇందులో ఉద్యోగుల ఖర్చు చూస్తే 59 శాతంగా ఉందన్నారు. మొత్తం ఆదాయం ప్రకారం చూసినా లక్షా 78 వేల కోట్లలో ఇది 47 శాతంగా మాత్రమే ఉందని బొప్పరాజు తెలిపారు. కాబట్టి చంద్రబాబు వాదన తప్పని ఆయన తేల్చేశారు.

అలాగే ఉద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లోనూ గత కాగ్ లెక్కల్ని సైతం షేర్ చేస్తున్నారు. వీటి ప్రకారం చూస్తే 2022-23లో జీతాలు, పెన్షన్లకు అయిన ఖర్చు రూ.53867 కోట్లని, ఇందులో రాష్ట్ర ఆదాయం ప్రకారం చూస్తే 34.14 శాతంగానూ, ఖర్చులో వాటా పరంగా చూస్తే 26.77 శాతం మాత్రమేనని చెప్తున్నారు. ఇదే కాలంలో జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు కలిపి చూసుకున్నా మొత్తం తమపై పెడుతున్న ఖర్చు 64 శాతంగానే ఉందన్నారు. కాబట్టి సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పిన లెక్క సరికాదని ఉద్యోగులు చెప్తున్నారు.




Click it and Unblock the Notifications