భారత్ - పాక్ మధ్య అణుయుద్ధం - ట్రంప్
భారత్ - పాక్ మధ్య యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తాను జోక్యం చేసుకుని అణు యుద్ధం సంభవించకుండా ఆపగలిగానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
ఈ మేరకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఒక పెద్ద సమస్యను పరిష్కరించానని.. దాని గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడరని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తాను కూడా ఎక్కువగా చెప్పనని.. భారత్-పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని తాను అడ్డుకున్నానని వెల్లడించారు.

ఇరు దేశాల నాయకులతో మాట్లాడి.. ఘర్షణలు కొనసాగితే అమెరికాతో వాణిజ్యం నిలిపివేస్తామని హెచ్చరించానని అన్నారు. ఆ తర్వాతే ఇరు దేశాలు దాడులు ఆపాయని ఆయన వివరించారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యా మీడియా మద్దతు ప్రకటించగా.. భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
భారత్ ఎప్పటినుంచో మధ్యవర్తిత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని ప్రకటించుకుంటూ వస్తోందని తెలిపింది. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకారం.. అంతర్గత, ద్వైపాక్షిక అంశాల్లో ఎలాంటి విదేశీ జోక్యం అనవసరం అనే నిర్ణయంతో ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వద్ద నేరుగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఉపాధ్యక్షుడు వాన్స్తో సమావేశం అద్భుతంగా, చాలా స్పష్టంగా జరిగిందని తెలిపారు. మధ్యవర్తిత్వం అనే ఈ ప్రశ్నకు మా వైఖరిని స్పష్టంగా తెలియజేశామని.. ఉపాధ్యక్షుడు వాన్స్ తమ వాదనలను పూర్తిగా అర్థం చేసుకున్నారని శశిథరూర్ వివరించారు.












Click it and Unblock the Notifications