భారతీయులపై వెటకారం: నోరుజారిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులపై నోరు పారేసుకున్నాడు. భారతీయులను వెటకారం చేశాడు. అదే సమయంలో భారత్ గొప్పదేశమని అభివర్ణించాడు. డెలావేర్లో ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు.
భారతీయులను లక్ష్యంగా చేసుకొని అవహేళనగా మాట్లాడాడు. భారత్ గొప్ప దేశమని, భారతీయ నేతలపై తనకు ఎలాంటి కోపం లేదన్నాడు. అమెరికాతోపాటు విదేశాల్లో తన క్రెడిట్ కార్డు కంపెనీకి వినియోగదారుల నుంచి లభిస్తున్న మద్దతుపై ఆరా తీసేందుకు భారత్లోని ఓ కాల్ సెంటర్కు ఫోన్ చేశానని చెప్పాడు.
డొనాల్డ్ ట్రంప్పై ఊగిపోయిన ప్రియాంక చోప్రా
భారత్లో ఉన్న కాల్ సెంటర్పై భారతీయ యాసలో ట్రంప్ మాట్లాడాడు. తన క్రెడిట్ కార్డు వినియోగదారుల సహాయ కేంద్రం అమెరికాలో ఉందా.. విదేశాల్లో ఉందా? తెలుసుకోవడానికి ఫోన్ చేసినట్లు తెలిపాడు. 'ఎక్కడుందో ఊహించారా? భారత్ నుంచి ఆ వ్యక్తి మాట్లాడారు. వారికెందుకు పని అప్పగించాల'ని మద్దతుదారులతో అన్నాడు.
'భారత్ గొప్ప దేశం.. అక్కడి నేతలపై నాకు ఎలాంటి ద్వేషం లేదు కానీ బుద్ధిలేని మన నేతలపై కోపంగా ఉంది' అని ట్రంప్ అన్నాడు. అమెరికాలోని బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులకు డెలవేర్ ముఖ్యకేంద్రమని, ఇక్కడే ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయని తెలిపాడు.
భారత్, చైనా, మెక్సికో, జపాన్ వలసవాద విధానాలను అడ్డుకోవాలని సూచించాడు. అమెరికా నుంచి వ్యాపారం తరలిపోయే విధానాలను అంగీకరించవద్దన్నాడు. ఉత్పాదక ఉద్యోగాలను లాక్కున్నారని, మనకు ఉద్యోగాలు లేకుండా చేశారని, అన్నింట్లో ముందంజలో లేకుండా చేశారని, పరిశ్రమలు మూతపడ్డాయని, ఇకముందు ఇలాంటి ఆటలు సాగనివ్వమని ట్రంప్ వ్యాఖ్యానించాడు.