Donald Trump: టుడే ఈజ్ ద బిగ్ వన్.. పరస్పర సుంకాలపై ట్రంప్ సంచలన పోస్ట్
Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశానికి కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ తో ఊహాగానాలకు ఆజ్యం పోశారు. ఈ పోస్ట్ లో ఆయన వాణిజ్యంలో పెద్ద ఎత్తుగడను సూచించారు. ప్రధాని మోడీతో తన సమావేశంలో సుంకాలు చర్చించబడతాయని భావిస్తున్న తరుణంతో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేయడం గమనార్హం. "టుడే ఈజ్ ద బిగ్ వన్:రెసిబ్రోకల్ టారిఫ్స్" అంటూ పరస్పర సుంకాలపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ట్రంప్ పరస్పర సుంకాలను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. తన తాజా సుంకాల ప్రణాళిక గురించి ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంతో ప్రపంచంలో అమెరికా దిగుమతులపై సుంకాలను వసూలు చేసే ప్రతీ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది.
పరస్పర సుంకాలను విధించాలనే ట్రంప్ ప్రణాళికల మధ్య ఈ పోస్ట్ వచ్చింది. ఈ చర్య ప్రపంచ వాణిజ్యానికి మరింత అంతరాయం కలిగిస్తుందని భావిస్తున్నారు. భారత్, ఇతర ప్రధాన వాణిజ్య భాగస్వాములు నోటీసులోకి వచ్చే అవకాశం ఉంది. పరస్పర సుంకాలు విధించే దేశాల జాబితాను ట్రంప్ నేడు ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం లేదా గురువారం నాటికి ఈ విధానంపై వివరణాత్మక ఉత్తర్వు జారీ చేయబడుతుందని ట్రంప్ ఇటీవల సూచించారు. ప్రధాని మోడీ రెండు రోజులు అమెరికా పర్యటనకు ముందు ట్రంప్ ఈ ప్రకటన చేశారు. భారత్ సుంకాల విధానాలపై ట్రంప్ పరిపాలన పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది. అవి అమెరికా దిగుమతులకు ఆటంకం కలిగిస్తాయని, న్యాయమైన వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తాయని వాదించింది.

అనేక దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్
మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం సుంకం, చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ లేవనెత్తిన అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి ఆందోళనలను పరిష్కరించడానికి మెక్సికో, కెనడా అంగీకరించిన తర్వాత, రిపబ్లికన్లు పొరుగు దేశాలపై సుంకాలు విధించడాన్ని మార్చి 1 వరకు వాయిదా వేశారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని బుధవారం అమెరికా చేరుకున్నారని తెలిసిందే. జనవరి 20న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనను కలిసిన నాల్గవ విదేశీ నాయకుడిగా ప్రధాని అమెరికా పర్యటన దౌత్యపరమైన సంబంధాలలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంయుక్త విలేకరుల సమావేశంతో సహా ట్రంప్ తో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక సహకారం వంటి అనేక అంశాలు వారి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
పరస్పర సుంకాలు అంటే ఏమిటి?
పరస్పర సుంకాలు అంటే మరొక దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్నులు. పరస్పర సుంకాల కోసం తన ప్రచారంలో ట్రంప్ "కంటికి కన్ను, సుంకానికి సుంకం, సరిగ్గా అంతే మొత్తం" అని హామీ ఇచ్చారు. ఆదివారం కూడా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం లేదా బుధవారం సుంకాలపై వివరణాత్మక ప్రకటన చేస్తామని ఆయన అన్నారు. ప్రతి దేశం ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే.. ఇతర దేశాలు అమెరికన్ ఉత్పత్తులకు వర్తించే రేటుతో దిగుమతులపై సుంకాల రేట్లను పెంచడమేనని నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications