భారీ భూకంపం.. 100 కిలోమీటర్ల లోతులో కదిలిన భూగర్భం!
భారత పొరుగు దేశమైన మయన్మార్లో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు భారత ప్రభుత్వ అధికారిక భూకంప అధ్యయన సంస్థ 'నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ' (NCS) వెల్లడించింది.
ఎన్సీఎస్ నివేదిక ప్రకారం.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6:59 గంటలకు భూమి కంపించింది. భూగర్భంలో దాదాపు 100 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు ఎన్సీఎస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో భూకంపానికి సంబంధించిన పూర్తి భౌగోళిక వివరాలను షేర్ చేసింది. భూకంప కేంద్రం అక్షాంశం: 23.590 N, రేఖాంశం: 94.624 E గా గుర్తించింది.

నాలుగు ప్లేట్ల మధ్య మయన్మార్.. అత్యంత ప్రమాదకరం..
భౌగోళికంగా మయన్మార్ దేశం భూకంపాలు, తీవ్రమైన సునామీలు సంభవించే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ముఖ్యంగా ఈ దేశం నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల (ఇండియన్, యురేషియన్, సుడాన్, బర్మా ప్లేట్లు) మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఈ ప్లేట్ల నిరంతర అంతర్గత కదలికలు, ఒకదానికొకటి ఢీకొనే ప్రక్రియల కారణంగా ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. వీటికి తోడు అండమాన్ సముద్రగర్భం నుంచి ఉత్తరాన ఉన్న కొలిజన్ జోన్ వరకు దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవైన 'సగైంగ్ ఫాల్ట్' (Sagaing Fault) అనే ప్రమాదకరమైన భూగర్భ చీలిక మయన్మార్ గుండా వెళ్తోంది.
ఈ సగైంగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లోని ప్రధాన నగరాలైన సగైంగ్, మాండలే, బాగో, యాంగూన్లకు భూకంప ముప్పు అత్యధికంగా ఉంది. ఈ నాలుగు నగరాల్లోనే మయన్మార్ మొత్తం జనాభాలో దాదాపు 46 శాతం మంది నివసిస్తుండటం గమనార్హం. దేశ రాజధాని యాంగూన్ నగరం ఈ భూగర్భ చీలికకు కొద్దిగా దూరంగా ఉన్నప్పటికీ, అక్కడ జనాభా సాంద్రత విపరీతంగా ఉండటం వల్ల చిన్న భూకంపం వచ్చినా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత చరిత్రను పరిశీలిస్తే.. 1903లో బాగో నగరంలో సంభవించిన 7.0 తీవ్రత గల భారీ భూకంపం యాంగూన్ నగరాన్ని కూడా అతలాకుతలం చేసింది. తాజా భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.














Click it and Unblock the Notifications