మళ్లీ భూ ప్రకోపం- వణికిన నగరాలు: రోడ్ల మీదే జనం జాగారం..!!
భూకంపాలు వదలట్లేదు. మొన్నటికి మొన్న వేలాదిమందిని బలిగొన్న టర్కీ, సిరియా, ఆ తరువాత ఇండోనేసియాలో భూకంప తీవ్రత తగ్గకముందే మరోసారి భూమి ప్రకోపించింది. జపాన్ లో తాజాగా పెను భూకంపం సంభవించింది.
జపాన్: పెను భూకంపాలు భూగోళాన్ని చుట్టేస్తోన్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వరుసబెట్టి భూకంపాలు నమోదవుతోన్నాయి..అది కూడా అనూహ్య తీవ్రతతో. మొన్నటికి మొన్న టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. టర్కీలో 50 వేల మందికి పైగా మరణించారు. సిరియాలో ఈ సంఖ్య 47,000లుగా రికార్డయింది.
ఈ రెండు దేశాలు కూడా ఇప్పటికీ తేరుకోలేకపోతోన్నాయి.. ఆ విషాదఛాయల నుంచి. ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. పెద్ద ఎత్తున ఆర్థిక, మానవ వనరుల సహాయాన్ని ప్రకటించాయి. ఈ రెండు దేశాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా కొనసాగుతోన్నాయంటే వాటి తీవ్రత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితుల మధ్య- తాజాగా మరోసారి పెను భూకంపం సంభవించింది. జపాన్ లోని హొక్కాయిడాను కొద్దిసేపటి కిందటే భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా రికార్డయింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో ఉంటుందీ హొక్కాయిడో. అక్కడి నెమురో రీజియన్ లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:27 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ భూకంప తీవ్రత తీర ప్రాంత నగరాలైన ఒబిహిరో, టొయొకొరొ, టైకీ, ఇకెడపై పడింది. ఆయా ప్రాంతాల్లో భూ ప్ర్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. నెమురో, ఒబిహిరొ, టొయొకొరొ వంటి చోట్ల కొన్ని భవనాలు బీటలు వారినట్లు చెబుతున్నారు.
ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడం వల్ల స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే జాగారం చేస్తోన్నారు. భూకంపం సంభవించిన వెంటనే రోడ్ల మీదికి ఉరుకులు పరుగులు పెట్టారు. సైరన్ మోతలతో పరిసరాలన్నీ మారుమోగిపోయాయి.












Click it and Unblock the Notifications