2020 నాటికి.. ఇక అలాంటి ఫోన్లు చూస్తాం: ప్రయత్నాల్లో యాపిల్..
శాన్ఫ్రాన్సిస్కో: స్మార్ట్ఫోన్ దిగ్గజం ఆపిల్ భవిష్యత్తులో మరో ఆకర్షణీయమైన డివైస్ను లాంచ్ చేయబోతోంది. ఫోన్ ను మడిచి జేబులో పెట్టుకునేందుకు అనువుగా ఫోల్డబుల్ డివైస్లను రూపొందించే పనిలో నిమగ్నమైంది.
2020నాటికి ఫోల్డబుల్ డివైస్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్న ఆపిల్.. ఆ దిశగా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కంపెనీ ఆసియా భాగస్వాములతో కలిసి ఈ ప్రొడక్ట్ ను రూపొందిస్తారని సమాచారం.
బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం.. ఆపిల్ తయారుచేయబోయే ఈ ఫోల్డబుల్ డివైస్ ఐప్యాడ్ టాబ్లెట్ లాగా కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఈ ఫోన్లలో ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ప్యానళ్లను వాడుతారని చెబుతున్నారు.
ఫోల్డబుల్ డివైస్ల తయారీకి సంబంధించి 2017, నవంబర్లోనే అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ కార్యాలయంలో ఆపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆపిల్ ఈ ప్రయత్నాల్లో ఉండగానే.. శాంసంగ్, లెనోవో వంటి కంపెనీలు కూడా ఫోల్డబుల్ ఫోన్ల తయారీకి కసరత్తులు మొదలుపెట్టినట్టు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.