రహస్యాలను అమెరికాకు చేరవేసిన ఇమ్రాన్ ఖాన్.. దీని ఫలితం?
Imran Khan: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ అధినేత, ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. ఊహించినట్టే- సంచలనం రేపిన సైఫర్ కేస్ ఆయనకు మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చింది ప్రత్యేక న్యాయస్థానం.
ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఇదే కేసులో దోషిగా తేలారు. వారిద్దరికీ 10 సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ మహ్మద్ జుల్కర్.. తుది తీర్పును వెలువడించారు.

ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు ఇమ్రాన్ ఖాన్. కొన్ని రహస్యాలను నిబంధనలకు వ్యతిరేకంగా వాషింగ్టన్లోని తమ దేశ రాయబారికి పంపించారని, సైఫర్ లీకులను చేరవేశారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.
సైఫర్ లీకుల వ్యవహారంలో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ.. ఇమ్రాన్ ఖాన్కు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది ప్రభుత్వం. ఈ క్రమంలో పోలీసులు ఇమ్రాన్ ఖాన్, ఖురేషీపై కేసులు నమోదు చేశారు. ఈ కేసును సత్వరమే విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్నీ ఏర్పాటు చేశారు.
దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన అనంతరం సైఫర్ కేసు లీకుల వ్యవహారంలో స్పెషల్ కోర్టు ఇద్దరినీ దోషులుగా గుర్తించింది. 10 సంవత్సరాల జైలుశిక్షను విధించిది. దీనిపై పీటీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్కు వెళ్తామని తెలిపింది.
ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్, షా మహ్మద్ ఖురేషీపై అక్రమ కేసులను బనాయించి, రాజకీయంగా లబ్ది పొందాలని అధికార పార్టీ భావిస్తోన్నట్లు ఆరోపించింది. ఉన్నత న్యాయస్థానంలో వారిద్దరూ నిర్దోషులుగా తేలుతారని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications