గాజా నరమేథంపై జో బైడెన్ దిగ్భ్రాంతి: ప్రధానికి ఫోన్ కాల్
వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.
తాజాగా గాజాలోని అల్- అహ్లీ అల్- అరబ్బీ ఆసుపత్రిపై దాడి సంభవించింది. ఈ ఘటనలో 500 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. గాజా ఉత్తర ప్రాంతంలోని అల్ ఉమిలూన్ మార్గంలో ఉంటుంది ఆసుపత్రి. మొత్తం గాజా స్ట్రిప్లోనే అతి పెద్ద ఆసుపత్రిగా చెబుతుంటారు. ఈ యుద్ధంలో గాయపడిన వారిలో చాలామంది ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అర్ధరాత్రి దాటిన తరువాత అల్- అహ్లీ ఆసుపత్రిపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. దీనిపై బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో భారీ శబ్దం చేస్తూ పేలిపోయిందా ఆసుపత్రి. కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున చెలరేగాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకూ వినిపించిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ దాడి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో ఫోన్లో మాట్లాడారు. తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ భద్రత విభాగంతో సమావేశం అయ్యారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆసుపత్రిపై దాడి- తనను తీవ్రంగా కలిచివేసిందని జో బైడెన్ పేర్కొన్నారు. భారీగా ప్రాణనష్టం సంభవించడం తనను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ సమయంలో పౌరుల జీవితాలకు భద్రత, భరోసాను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. పాలస్తీనియన్లకు అండగా ఉంటామని చెప్పారు.
అనంతరం జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మేరీల్యాండ్లో గల అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్నారు. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఆయన బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమౌతారు. అనంతరం జోర్డాన్, పాలస్తీనా, ఈజిప్ట్లల్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ- ఆసుపత్రిపై దాడితో ఈ మూడు దేశాలు బైడెన్తో భేటీని రద్దు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications