యుద్ధం ఎఫెక్ట్.. కేజీ చక్కెర రూ. 5వేలు.. లీటరు నూనే రూ. 4వేలు.. బక్రీదు రోజున ఆ దేశంలో..!
మన దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగితే రూ. 5 నుంచి రూ. 10 వరకు తేడా ఉంటుంది. కానీ ఆ దేశంలో మాత్రం వందలు దాటి వేలల్లోకి వెళ్లింది. ఒక్క యుద్దం వారి జీవితాలనే మార్చేసింది. ఇజ్రాయెల్- హమాస్ ఆధిపత్య పోరులో గాజా ప్రాంతం అట్టుడికి పోతోంది. యుద్ధం కారణంగా అక్కడి నిత్యావసరాల ధరలు సాధారణం కంటే 500 రెట్లు పెరిగాయి. తాజాగా మనదేశంలో రూ. 5 కు దొరికే పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ ధర గాజాలో రూ. 2,300 కు చేరింది. ఈ క్రమంలో అక్కడి నిత్యావసరాల ధరలు ఓసారి పరిశీలిస్తే..
ఇవాళ బక్రీదు పండగ. ఈ పండుగ ముస్లింలకు ప్రత్యేకం. కానీ గాజాలోని ప్రజలు పండగ రోజును సంతోషంగా జరుపుకొనే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై జరిపిన చర్చలు ఫలించక పోవడంతో అక్కడి ప్రజలు మసీదుల్లో కాకుండా రోడ్లపైనా, ఇళ్లు, స్కూల్లు, మత పరమైన సంస్థల వద్దే ప్రార్థనలు చేసుకుంటున్నారు.
సాధారణంగా బక్రీదు రోజున గాజా ప్రజలు సంతోషంగా గడుపుతారు. ఈ సెలవు దినాన్ని సంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తారు. మాంసం పంచుతారు, విందు వినోదాలు జరుపుకుంటారు. చిన్నారులకు బహుమతులు ఇస్తారు. కానీ ఈ సారి అలా లేదు. అక్కడి ప్రజలంతా ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. గాజాలో నిత్యావసరాల ధరలు వందల రెట్లు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ కరెన్సీ షకీల్ ప్రకారం భారత కరెన్సీ చూస్తే.. ఒక్క షకీల్ 24 రూపాయలతో సమానంగా చెప్పవచ్చు.
గాజాలో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు ఓసారి పరిశీలిస్తే.. ఒక లీటరు నూనె ధర రూ. 4,177, కేజీ చక్కెర ధర రూ. 4,914, కేజీ పాల పౌడర్ ధర రూ. 860, కేజీ పిండి ధర రూ. 1,474, కేజీ ఉప్పు ధర రూ. 491, కేజీ ఓక్రా ధర రూ. 1,106, కేజీ బాతు మాంసం ధర రూ. 737, కేజీ టమాటో ధర రూ. 1,106, కేజీ ఉల్లిగడ్డల ధర రూ. 4,423, కేజీ ఆలూ ధర రూ. 1,966, కేజీ వంకాయ ధర రూ. 860, కేజీ నిమ్మకాయల ధర రూ. 1,417, కప్పు కాఫీ పౌడర్ ధర 4, 423, ఒక బాక్స్ మేక మాంసం ధర రూ. 4,914 లుగా ఉంది. ఉద్యోగ ఉపాధి లేని గాజాలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ధరలు ఊహించలేనిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మరోవైపు హమాస్ పై ఇజ్రాయెల్ మండిపడుతోంది. గాజా ప్రాంత ప్రజలకు పంపిన ఆహార ట్రక్కులను హమాస్ సైన్యం దోచుకుంటోందని.. ఆహారాన్ని అక్కడి ప్రజలకు చేరకుండా చేస్తోందని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం అధికారి గయ్ నీర్ తెలిపారు. 80 శాతం ఫుడ్ ట్రక్కులను హమాస్ దోచుకుందని ఆరోపించారు. ఈ ట్రక్కలను హమాస్ సైన్యం దోచుకుని గాజా ప్రజలకు అధిక రేట్లకు అమ్ముకుంటోందన్నారు.












Click it and Unblock the Notifications