ఆ విమానం జాడ ఎప్పటికీ మిస్టరీయే: 'ఎంహెచ్-370' గాలింపుకు ముగింపు
గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్టు జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ మంగళవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
సిడ్నీ: అదృశ్యమైపోయిన ఎంహెచ్-370 విమానం ఒక మిస్టరీగానే మిగిలిపోనుంది. మూడేళ్ల నుంచి సుదీర్ఘంగా జరుగుతున్న గాలింపు చర్యలు ఎలాంటి ఆధారాలను సంపాదించలేకపోయాయి. దీంతో గాలింపు చర్యలను ఇక నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకటించింది.
కాగా, 2014 మార్చి 8న మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్-370 విమానం అదృశ్యమైపోయిన సంగతి తెలిసిందే. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయిన ఉండవచ్చునని నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో 239మంది జలసమాధి అయినట్టుగా భావించారు.
మారిషస్ తీరానికి కొట్టుకొచ్చిన కొన్ని శకలాలను ఎంహెచ్-370కి చెందినవిగా గుర్తించారు. ఇంతకుమించి విమానానికి సంబంధించి మరే ఆధారం లభించలేదు. మూడేళ్ల పాటు దీని గురించి పరిశోధించినా.. పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక గాలింపుకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్టు జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ మంగళవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని సముద్రం లోపల లక్షా 20వేల చదరపు కిలోమీటర్ల మేర సెర్చ్జోన్లో చేపట్టిన గాలింపు చర్యల్లో ఎలాంటి ఆధారాలు లభ్యమవలేదు.
ఎంహెచ్-370 విమాన అదృశ్యంపై గాలింపు చర్యలు ముగిసిపోవడంతో ఇక ఈ విమాన అదృశ్యం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది.