పహల్గామ్ ఉగ్రదాడి కేసులో సంచలనం.. హఫీజ్ సయీద్ కు బిగుస్తున్న ఉచ్చు
జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాకు చెందిన పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రధాన నిందితుడిగా లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను జాతీయ దర్యాప్తు సంస్థ చేర్చిన నేపథ్యంలో అతడికి సమన్లు పంపడానికి ఎన్ఐఏ కోర్టు సిద్ధం అవుతోంది.
ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలని సమన్లలో ఎన్ఐఏ అధికారులు ఆదేశించే అవకాశం ఉంది. దాంతో పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఆయనకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా భావించవచ్చు. ఇక ఇప్పటికే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు హఫీజ్ సయీద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈ సమన్లను లాహోర్ లోని సయీద్ కు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ ద్వారా పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ సమన్లను జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్రం సమాయత్తం అవుతోంది.
ఇదిలా ఉండగా 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడుల వెనుక మాస్టర్ మైండ్ లుగా నిషేధిత లష్కరే తోయిబా హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ లతో సహా మొత్తం ఆరుగురు ప్రధాన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా వారికి కోర్టు జారీ చేసిన ప్రకటన ఉత్తర్వుల్ని అందజేసేందుకు ముంబై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఈ ఉగ్రవాదులకు ఇంటర్ పోల్ ద్వారా నోటీసుల్ని జారీ చేయాలని ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

మరోవైపు కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ పాత్రపై పాకిస్థాన్ కు చెందిన ఓ మతగురువే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ కు హఫీజ్ సయీద్ ఏకంగా 10 వేల మంది ఉగ్రవాదులను పంపాడని పాకిస్థాన్ మత గురువు నజీర్ మదానీ బహిరంగంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications