హైతిలో భూకంప విలయం: 1300 మంది దుర్మరణం, 3వేలకుపైగా క్షతగాత్రులు, హృదయవిదారకం
పోర్ట్-ఓ-ప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. 7.2 తీవ్రతతో కుదిపేసిన భూకంపం వేలాది మంది ప్రాణాలు తీసి తన కర్కశాన్ని చాటుకుంది. ఆదివారం నాటికి ఈ మహా విలయానికి 1297 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 3వేల మంది వరకు గాయాలతో బయటపడ్డారు.

హైతీలో పెను విషాదాన్ని మిగిల్చిన భారీ భూకంపం
భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో వందల సంఖ్యలో నివాసాలు కుప్పకూలాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అనేక సంక్షోభాల తర్వాత ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ఈ పేద దేశంపై భూకంప రూపంలో మరో విలయం రావడంతో ప్రజలతోపాటు పాలకులు కూడా విలవిల్లాడిపోతున్నారు. హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్కు పశ్చిమ దిశగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శనివారం రోజంతా భూ ప్రకంపనలు కొనసాగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇక ఆదివారం తెల్లవారుజామున కూడా 6 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం హైతీలోని అనేక ప్రాంతాలను హృదయ విదారకంగా మార్చేసింది.

నేలమట్టమైన అనేక నివాస భవనాలు.. శిథిలాల్లో వేలాది మంది..
భూకంప తీవ్రతకు అనేక నివాస భవనాలు, హోటళ్లు, అనేక నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. భయంతో ప్రజలు వీధులకు పరుగులు తీశారు. భవనాల్లో ఉన్న అనేక మంది ఈ భూకంపానికి బలయ్యారు. వేలాది మంది వాటి భవనాల శిథిలాల్లో చిక్కుకున్నారు. మృతులను, క్షతగాత్రులను శిథిలాల నుంచి బయటికి తీసేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వేల సంఖ్యలో నిరాశ్రయులైన ప్రజలు.. కన్నీటివ్యథలు..
భూకంపం కారణంగా అనేక నివాస భవనాలు నేలమట్టం కావడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మందిని ప్రార్థనాలయాలు, పునరావాస కేంద్రాలకు తరలించారు. గాయపడిన వారితో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసినా ప్రజల కన్నీటి వ్యథలే కనిపించాయి. ప్రజలకు తాగునీరు, ఆహారం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఆహారం కోసం ఎగబడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

హైతీలో నెలరోజులు అత్యయిక పరిస్థితి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
భూకంపం సృష్టించిన పెను బీభత్సంతో హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ నెలరోజులపాటు అత్యయిక పరిస్థితిని విధించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ప్రజలంతా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. నష్టం తీవ్రత పూర్తిస్థాయిలో అంచనా వేసేంత వరకు అంతర్జాతీయ సాయాన్ని కోరమని తెలిపారు. ప్రస్తుతం గాయాలపాలైనవారికి మెరుగైన వైద్యం అందించి వారిని పూర్తి ఆరోగ్యం వంతులను చేయడమే తమ ముందున్న కర్తవ్యమని తెలిపారు. సుమారు 900ల వరకు నివాసాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు చెప్పారు. కాగా, లెస్కేయన్కు 10.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న ద్వీపంపైనా ఈ భూకంప తీవ్రత కొనసాగింది. దీంతో ప్రముఖలు, పర్యాటకులు సేద తీరేందుకు వచ్చే అక్కడి రిసార్టులు బాగా దెబ్బతిన్నాయి.
Recommended Video

హైతీకి వరుస సంక్షోభాలు.. ముందున్న గండం పెను తుఫాను గ్రేస్
గత కొంత కాలంగా వరుస సంక్షోభాలతో కోటికిపైగా జనాభా ఉన్న ఈ దేశం అతలాకుతలమవుతోంది. కరోనావైరస్ విలయం, ఇటీవల దేశాధ్యక్షుడి హత్య, పేదరికం సమస్యలతో ఇప్పటికే ఈ దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజలంతా భయాందోళనలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు పెను తుఫాను గ్రేస్ కూడా హైతీపై ప్రభావం చూపే అవకాశం ఉందనే సూచనలు పాలకులను, ప్రజలను మరింత ఆందోళనలకు గురిచేస్తున్నాయి. భూకంప తీవ్రతతో భారీగా నష్టపోయిన హైతీకి సాయం చేసేందుకు ఇప్పటికే తమ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. యూఎస్ ఎయిడ్ ఉన్నతాధికారి సమాంతా పవర్ను ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నియమించారు. మిత్రదేశమైన హైతీకి తాము అన్నివిధాలుగా అండగా ఉంటామని బైడెన్ ప్రకటించారు. అర్జెంటీనా, చిలీ లాంటి దేశాలు కూడా తమవంతుగా సాయం చేస్తామని పేర్కొన్నాయి. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించే విషయంలో అండగా ఉంటామని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కాగా, 2010లో సంభవించిన భారీ భూకంపానికి హైతీ దేశంలో మూడు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. 2012లో వచ్చిన భూకంపంతో 12 మంది చనిపోయారు. పేద దేశమైన హైతీపై వరుసగా ప్రకృతి ప్రకోపిస్తుండటం ఇక్కడి ప్రజలకు శాపంగా మారినట్లయింది.












Click it and Unblock the Notifications