Nepal flash floods: దేవుడిలా వచ్చి 1,643 మంది పిల్లల్ని కాపాడి.. రియల్ హీరో
నేపాల్ లోయలలో హిమపాతం రూపంలో వచ్చిన ప్రళయంలో ఒక ఊహించని అద్భుతం జరిగింది. మంచు చరియలు విరిగిపడి త్రిశూలి నది ఉప్పొంగిన క్షణాల్లో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చూపిన సమయస్ఫూర్తి ఏకంగా 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. మృత్యువు కొద్ది నిమిషాల దూరంలో ఉన్న వేళ.. కేవలం ఒక్క ఫోన్ కాల్ అలర్ట్తో చాకచక్యంగా వ్యవహరించి, ఆ బడి పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించిన ఆ రియల్ హీరో కథ ఇప్పుడు అందరి గుండెలను పిండేస్తోంది.
నువాకోట్లోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడి (47) బుధవారం ఉదయం 9:20 గంటల సమయంలో పాఠశాలకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నదికి సమీపంలో ఉన్న గ్రామం కొట్టుకుపోయిందని, వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని ఆయనకు ఒక స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. మూడంతస్తుల కాంక్రీటు భవనంలో 1,643 మంది పిల్లలు ఉన్నారు. తొలుత అంత ఎత్తులో ఉన్న బడికి నీళ్లు రావులే అనుకున్నా, ప్రవాహ తీవ్రతను చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజేంద్ర సైరన్ మోగించారు. ఉపాధ్యాయులందరినీ అప్రమత్తం చేసి, పిల్లలను హుటాహుటిన కొండపై ఉన్న బోధి చెట్టు వైపు పరుగెత్తించారు. కొన్ని నిమిషాల్లోనే ఆ భారీ పాఠశాల భవనాన్ని నది నీళ్లు ముంచెత్తాయి.

ఇద్దరిని బలితీసుకున్న జలప్రళయం.. పాఠశాల సిబ్బంది ఆవేదన!
రాజేంద్ర చాకచక్యంతో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ, దురదృష్టవశాత్తూ ఇద్దరు పాఠశాల సిబ్బంది ఈ ప్రళయంలో ప్రాణాలు కోల్పోయారు. ఉపాధ్యాయుడు సంతోష్ పరియార్ (32) అల్పాహారం కోసం గదికి వెళ్లిన సమయంలో నీటి ఉధృతికి కొట్టుకుపోగా, పాఠశాల తలుపులు వేసేందుకు వెళ్లిన సుల్తాన్ లామా అనే జానిటర్ కూడా నీటిలో కొట్టుకుపోయి మరణించారు. ఓ విద్యార్థిని భయంతో స్పృహ తప్పిపోగా, ఒక ఉపాధ్యాయుడు మోటార్సైకిల్పై ఆమెను కొండపైకి చేర్చాడు.
3,000 మందికి పైగా గల్లంతు.. నేపాల్, టిబెట్లో పెరిగిన మృతుల సంఖ్య!
లాంగ్టాంగ్ లిరుంగ్ శిఖరం నుంచి భారీ మంచు కొండచరియలు 1,200 మీటర్ల లోతున నదిలో పడటంతోనే ఈ భారీ ప్రళయం సంభవించింది. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో వచ్చిన ఈ ఊహించని వరదల వల్ల ఇప్పటివరకు నేపాల్లోనే 730 మందికి పైగా, టిబెట్లో 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో కలిపి దాదాపు 3,000 మందికి పైగా ప్రజలు, విదేశీ పర్యాటకులు గల్లంతయ్యారు. వందలాది మృతదేహాలను వెలికితీస్తుండగా, గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
జలవిద్యుత్ టన్నెళ్లలో 100 మందికి పైగా కార్మికులు చిక్కులు!
ఈ జలప్రళయం వల్ల పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలోకి భారీగా నీరు, బురద చేరుకున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టులోని సొరంగంలో 100 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోవడంతో నేపాల్ సైన్యం పైపుల ద్వారా ఆక్సిజన్ను లోపలికి పంపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం భారతదేశం 11 మంది నిపుణులైన సహాయక బృందాన్ని పంపగా, చైనా కూడా తన టన్నెల్ రెస్క్యూ టీమ్ను రంగంలోకి దించింది. అయితే నిరంతర వర్షాలు, నదిలో మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.














Click it and Unblock the Notifications