పెళ్లయిన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని బలవన్మరణం.. కారణం ఏంటంటే..?
యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనతో యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురు చావుకు అల్లుడే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం తాటపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి(20) హైదరాబాద్ ఘట్ కేసర్ పీఎస్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి తో ఆమెకు వివాహం జరిగింది.
అయితే పెళ్లి అయిన తర్వాత నుంచి పల్లవి కాలేజీకి వెళ్లలేదు. కానీ ఈ గురువారం నుంచి కాలేజీకి పల్లవి హాజరు అవతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం విద్యార్థులు అంతా వెళ్లిపోయిన తర్వాత 3 వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది పల్లవి. వెంటనే గుర్తించిన కాలేజీ సిబ్బంది యువతిని తొలుత జీడిమెట్లలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పల్లవి మృతి చెందింది.

అయితే అదనపు కట్నం కోసం పల్లవికి భర్త శ్రీకాంత్ నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు మొదలయ్యాయని అందువల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి సంధ్య.. ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications
