టెన్షన్... టెన్షన్: రాజ్ నాథ్ సింగ్ పాక్ పర్యటన డౌట్ ?
లాహోర్/ న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జరగనున్న సార్క్ సమావేశంలో పాల్గోనడాకి ఉద్దేశించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ లో అడుగు పెడితే తీవ్ర పరిణామాలు తప్పవని అక్కడి ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి.
పాక్ లోని హిజబుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సలావుద్దీన్ రాజ్ నాథ్ సింగ్ పర్యటనను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా (పాక్ లో) తీవ్ర ఆందోళనలు చేపడుతున్నాడు. ఇప్పటికే ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.
హిజబుల్ ముజాహుద్దీన్ కు జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయిద్ మద్దతు ఇచ్చి ఆందోళనలు మరింత రెచ్చగొడుతున్నాడు. రాజ్ నాథ్ సింగ్ పర్యటన సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా అందుకు పాక్ ప్రభుత్వం భాద్యత వహించాలని హెచ్చరించారు.
రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు పాక్ ప్రభుత్వం భద్రత కల్పించాలని భారత విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. రాజ్ నాథ్ సింగ్ పర్యటనలో ఎలాంటి మార్పులు ఉండవని భారత విదేశాంగ కార్యాలయం అధికారులు సోమవారం చెప్పారు.
కాశ్మీర్ లో అమాయకులు బలి కావడానికి రాజ్ నాథ్ సింగ్ కారణమని పాక్ లోని ఉగ్రవాద సంస్థ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజ్ నాథ్ సింగ్ ను పాక్ పర్యటనకు ఆహ్వానిస్తే కాశ్మీర్ ప్రజల మనసులు గాయపడుతాయని అంటున్నారు.
2008లో ముంబైలో జరిగిన మారణకాండ వెనుక హఫీజ్ ( మాస్టర్ మైండ్) ఉన్నాడని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అదే హఫీజ్ ఇప్పడు రాజ్ నాథ్ సింగ్ పాక్ పర్యటనను వ్యతిరేకిస్తూ పాక్ లోని లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, ముల్తాన్, పైసలాబాద్, క్వెట్టా తదితర నగరాల్లో ఆందోళనలు చేస్తున్నాడు.
పాక్ లోని అన్ని ప్రధాన నగరాల్లో ఆగస్టు మూడవ తేది నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పాడు. ఈ సందర్బంలో పాక్ లో ఆగస్టు మూడవ తేది రాజ్ నాథ్ సింగ్ పర్యటన ఉంటుందా ? లేదా ? అనే విషయంపై టెన్షన్ మొదలైయ్యింది.