చైనా కారిడార్: భారత్ ఏం చేస్తుందోనని పాకిస్తాన్ ఆందోళన
అహ్మదాబాద్: చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్.. ఆ కారిడార్ నిర్మాణాలపై దాడులకు దిగే అవకాశాలు లేకపోలేదని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం గిల్గిత్ బాల్టిస్థాన్ హోం శాఖకు ఓ లేఖ రాస్తూ.. సీపీఈసీలో భద్రతను పెంచాలని సూచించింది.
ఈ విషయంపై డాన్ పత్రిక ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. 400 మంది ముస్లిం యువకులను ఎంపిక చేసిన భారత్, వారికి శిక్షణ కోసం ఆఫ్గనిస్థాన్కు పంపిందని, వారు శిక్షణ తర్వాత సీపీఈసీలోని నిర్మాణాల విధ్వంసానికి దిగనున్నారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ భయపడుతున్నట్టు తెలిపింది.
కోరాకోరం హైవేపై ఉన్న వంతెనలు లక్ష్యంగా వీరు విరుచుకుపడవచ్చని హెచ్చరిస్తూ మరింతమంది సైన్యాన్ని అక్కడ నియమించాలని కోరింది.
ఇప్పటికే సీపీఈసీ మార్గంలో సెక్యూరిటీని పెంచగా వంతెనలు ఉన్నచోట్ల, సునిశిత ప్రాంతాలుగా గుర్తిస్తూ భద్రతను మరింత పెంచింది. సీపీఈసీ ప్రాజెక్టును చైనా ప్రకటించినప్పటి నుంచి భారత్ తీవ్రంగా అభ్యంతర పెడుతున్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్తో చర్చలకు సిద్ధమని చైనా ఇప్పటికే ప్రకటించింది. పాకిస్థాన్లోని గ్వదార్ నౌకాశ్రయానికి, చైనాలోని క్సింజియాంగ్ ప్రావిన్స్ను కలుపుతూ నిర్మిస్తున్న ఈ కారిడార్లో పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి వల్ల తన సార్వభౌమాధికారానికి విఘాతం కలుగుతుందన్నది భారత్ ప్రధాన అభియోగం.