భారత్-అమెరికా '10 ఏళ్ల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్': చైనా, పాక్కు టెన్షన్?
India-America: భారత్, అమెరికా మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అయింది. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం-ప్లస్(ADMM-Plus) సదస్సు సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హేగ్సేత్లు సమావేశమయ్యారు. ఈ భేటీ చారిత్రక నిర్ణయానికి దారి తీసింది. ఇరు దేశాల రక్షణ బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చే ఉద్దేశంతో '10 ఏళ్ల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్'పై వారు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వైపాక్షిక రక్షణ సహకారంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
చారిత్రక ఒప్పందంపై రక్షణ మంత్రుల ప్రకటన
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన తర్వాత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో తాము మూడు సార్లు టెలిఫోన్లో మాట్లాడుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం-ప్లస్ సదస్సు సందర్భంగా వ్యక్తిగతంగా కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఫ్రేమ్వర్క్ రెండు దేశాల రక్షణ సంబంధాల సంపూర్ణ కోణానికి విధానపరమైన దిశానిర్దేశం చేస్తుందని, అలాగే తమ పెరుగుతున్న వ్యూహాత్మక అనుసంధానానికి సంకేతమని అన్నారు. ఇది భాగస్వామ్యంలో కొత్త దశాబ్దానికి సూచిక అని, ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వతంత్రంగా, బహిరంగంగా, నియమ-ఆధారితంగా ఉంచడానికి ఈ భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

పెరగనున్న రెండు దేశాల రక్షణ భాగస్వామ్యం
అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా రెండు దేశాల రక్షణ భాగస్వామ్యం మరింత పెరుగుతుందని, ఇది ప్రాంతీయ స్థిరత్వం, ప్రతిఘటనకు పునాది అని పేర్కొన్నారు. భారత్తో తమకున్న భాగస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనదని, తమ వ్యూహాత్మక అనుసంధానం ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్కు నిబద్ధతపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ 10 ఏళ్ల ఫ్రేమ్వర్క్ అనేది ఒక ప్రతిష్టాత్మక లక్ష్యంతో కూడిన ఒప్పందమని, సైనిక సహకారం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఒక రోడ్మ్యాప్ను అందిస్తుందని ఆయన తెలిపారు.
Had a fruitful meeting with my US counterpart @SecWar Peter Hegseth in Kuala Lumpur. We signed the 10 years ‘Framework for the US-India Major Defence Partnership’. This will usher in a new era in our already strong defence partnership.
— Rajnath Singh (@rajnathsingh) October 31, 2025
This Defence Framework will provide policy… pic.twitter.com/IEP6Udg9Iw
వ్యూహాత్మక ప్రయోజనాలు
ఈ భేటీలో రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రతతో పాటు కొన్ని కీలక అంశాలపై కూడా చర్చలు జరిగాయి. గతంలో సుంకాల వివాదం కారణంగా రద్దయిన ద్వైపాక్షిక భేటీ అనంతరం ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇరు దేశాలు తమ సమన్వయాన్ని, గూఢచార సమాచార మార్పిడిని, సాంకేతిక సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించాయి. రక్షణ సాంకేతికత బదిలీ ద్వారా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి భారీగా ఊతమిస్తుంది. సంయుక్త సైనిక విన్యాసాలు, గూఢచార సమాచార భాగస్వామ్యం దేశ భద్రతను బలోపేతం చేస్తాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావానికి కళ్లెం వేయడానికి భారత్ ఒక బలమైన భాగస్వామిగా నిలబడటం అమెరికాకు కీలకం. అంతేకాకుండా అమెరికన్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతికి ఇది తోడ్పడుతుంది. మొత్తంగా, ఈ 10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్వర్క్ సంతకం ఇరు దేశాల సంబంధాల్లో ఒక మలుపుగా నిలుస్తుంది, ఇది చైనా, పాకిస్తాన్లకు వ్యూహాత్మక ఆందోళన కలిగించే అంశం కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications