భారత్.. దిగొచ్చింది: మనం బట్టబయలు చేశాం: డొనాల్డ్ ట్రంప్
Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై అత్యధికంగా పన్నులను విధించడాన్ని తప్పు పడుతూ వస్తోన్న ఆయన- భారత్ అనుసరిస్తోన్న ఇష్టానుసార టారిఫ్ విధానాలను బట్టబయలు చేశామని వ్యాఖ్యానించారు.
భారత్ సహా ట్రంప్ టారిఫ్ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్న విషయం తెలిసిందే. ఈ నాలుగు దేశాలపైన సరికొత్త టారిఫ్ను ఆయన కిందటి నెలలో ప్రకటించారు. ఈ క్రమంలో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్ను అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్ను విధించింది అమెరికా.

భారత్పై విధించిన టారిఫ్.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. అమెరికా విధించిన కొత్త టారిఫ్ వల్ల భారత్పై సంవత్సరానికి ఏకంగా ఏడు బిలియన్ డాలర్ల మేర అదనపు భారం పడే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోందనే అంశం చర్చనీయాంశమైంది.
ఈ పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని వెల్లడించారు. ఆ దేశం అనుసరిస్తోన్న అత్యధిక టారిఫ్ విధానాన్ని ఎవరో ఒకరు బట్టబయలు చేయాల్సొచ్చిందని వ్యాఖ్యానించారు. భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్ను ఇలాగే కొనసాగితే ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేమని పేర్కొన్నారు.
అధిక పన్నుల వల్ల భారత్కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారిందని ట్రంప్ తేల్చి చెప్పారు. అందుకే- ఆ దేశంపై తాము కూడా రెసిప్రోకల్ (పరస్పర) టారిఫ్ను భారీగా పెంచాల్సి వచ్చిందని వివరించారు. ఫలితంగా తమ దేశంపై విధించిన టారిఫ్ను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని వెల్లడించారు.
ఇతర దేశాలు, ప్రత్యేకించి- భారత్ సహా అధిక టారిఫ్ను విధించే దేశాలు.. తమ దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికన్ వస్తువులపై అధిక సుంకాలు విధించడాన్ని విమర్శించారు.
అమెరికా పాల ఉత్పత్తులపై కెనడా 250 శాతం టారిఫ్ను విధించడాన్ని ట్రంప్ తప్పు పట్టారు. ఇది అన్యాయమని వ్యాఖ్యానించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా, ఇతర దేశాలు తమపై ఏ స్థాయిలో పన్ను విధిస్తోన్నాయో అదే స్థాయిలో తాము కూడా రెసిప్రోకల్ టారిఫ్ను విధిస్తామని ఆయన హెచ్చరించారు.
కలప, పాల ఉత్పత్తులపై టారిఫ్ విషయంలో కెనడా చాలాకాలం నుంచి మోసం చేస్తోందంటూ మండిపడ్డారు ట్రంప్. 250 శాతం టారిఫ్ విధించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. దీని గురించి ఎవరూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. దేశ రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలను కెనడా వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఇకపై అలా జరగనివ్వనని అన్నారు.
యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడా వంటి అనేక దేశాలు తాము అమలు చేస్తోన్న టారిఫ్ కంటే చాలా ఎక్కువ మొత్తంలో పన్నులను వసూలు చేస్తున్నాయని, ప్రత్యేకించి- భారత్ నూటికి నూరు శాతం కంటే అధికంగా ఆటో ట్యాక్సులను వసూలు చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications