ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణం
ఆస్ట్రేలియా : భార్యతో సంతోషంగా మాట్లాడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రమాదవశాత్తు మూడు అంతస్తుల నుండి కిందపడి దుర్మరణం చెందిన సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగింది. భారత్ కుందిన పంకజ్ షా (29) అనే యువకుడు గురువారం వేకువ జామున దుర్మరణం చెందాడు.
నార్త్ సిడ్నీలోని ఐటి కంపెనీలో పంకజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను ఇటివలే భారత్ వచ్చి వివాహం చేసుకున్నాడు. కొంత కాలం భార్య, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాడు. త్వరలోనే సిడ్ని తీసుకు వెళ్తానని భార్యకు అతను చెప్పాడు.
తరువాత సెలవులు పూర్తి కావడంతో సిడ్నీ చేరుకున్నాడు. గురువారం వేకువ జామున పంకజ్ తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ మూడవ అంతస్తులోని బాల్కనిలో నిలబడి భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ సందర్బంలో ప్రమాదవశాత్తు అతను మూడు అంతస్తుల నుండి కిందకు పడిపోయాడు.
అపార్ట్ మెంట్ సిబ్బంది వెంటనే పోలీసులు, వైద్యులకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి పంకజ్ మరణించాడని పోలీసులు అన్నారు. పంకజ్ తలకు తీవ్రగాయాలు కావడంతో మరణించాడని పోలీసులు చెప్పారని పంకజ్ పని చేస్తున్న ఐటి కంపెనీ మేనేజర్ కరేన్ వాలర్ తెలిపారు. పంకజ్ ఫోన్ ముక్కలు ముక్కలు అయ్యింది. పోలీసులు పంకజ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.