తుపాకీ పెట్టి పెళ్లాడాడు, నరకం: పాక్ వ్యక్తిపై ఆ దేశంలో భారత యువతి పోరాటం
ఇస్లామాబాద్: తన తలకు తుపాకీ పెట్టి మరీ తనను బలవంతంగా వివాహం చేసుకున్నాడని పాకిస్థాన్ జాతీయుడిపై ఓ భారతీయ యువతి(20) ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తనను తిరిగి భారతదేశానికి పంపించాలంటూ విన్నవించుకుంది. అప్పటి వరకు తాను హైకమిషన్ కార్యాలయాన్ని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.
తన ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్లు కూడా తస్కరించబడ్డాయని తెలిపింది. ఇప్పుడు తన భర్తగా చెప్పుకుంటున్న వ్యక్తి తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయింది. కాగా, ఇస్లామాబాద్ కోర్టులో కూడా ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉజ్మా అనే భారతీయ మహిళకు తాహిర్ అలీ పాక్ వ్యక్తికి మలేషియాలో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన బంధువులను కలిసేందుకు వెళుతున్నానని చెప్పిన ఉజ్మా.. వాఘా సరిహద్దు గుండా మే 1న పాకిస్థాన్కు వెళ్లింది. అక్కడే వారి వివాహం మే3న జరిగినట్లు సమాచారం.
అయితే, అతడికి ముందే వివాహం అయినట్లు, కేవలం నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఉజ్మాకు ప్రేమించుకునే సమయంలో తెలియదు. కాగా, కేవలం చూసేందుకు వెళ్లిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే గాకుండా.. తుపాకీతో బెదిరించి తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అప్పట్నుంచి తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె భారత హైకమిషన్ కార్యాలయంలో వాపోయింది.
వెంటనే తనను భారత దేశం పంపించాలని, తన వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్లు కూడా వారు దొంగలించారని ఆరోపించింది. ఈ విషయంపై మనదేశంలోని పాక్ హై కమిషనర్, పాక్లోని భారత హైకమిషనర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది ఇలా ఉంటే... ఉజ్మాను నిర్బంధించారంటూ ఆమె భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.