యెమెన్లో యుద్ధ వాతావరణం: భారతీయుల్ని రప్పించేందుకు షిప్స్
యెమెన్: యెమెన్లో అంతర్గత యుద్ధం అంచుకు చేరింది. యెమెన్ను రక్షించేందుకు సౌదీ దేశాల ప్రాంతీయ కూటమి రంగంలోకి దిగింది. యెమెన్ను చేజిక్కించుకునేందుకు విధ్వంసకాండకు దిగుతున్న హైతీ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఈ కూటమి గురువారం వైమానిక దాడులు జరిపింది. ఈ కూటమికి నిఘా సహా ఇతరత్రా సహకారాన్ని అందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించినట్లు వాషింగ్టన్ పేర్కొంది.
తిరుగుబాటుదారులను అణిచివేసే కూటమిలో సౌదీ అరేబియాతో పాటు ఖతార్, కువైట్, బహ్రెయన్, యూఏఈ దేశాలున్నాయి. హైతీ తిరుగుబాటుదారులనుంచి దేశాన్ని, ప్రజలను రక్షించాలని యెమెన్ అధ్యక్షుడు మన్సూర్ హది విజ్ఞప్తి మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ రాయబారి అదెల్ అల్ జుబేర్ పేర్కొన్నారు. అయితే ఈ కూటమిలో ఉన్న ఇతర దేశాల పేర్లను ఆయన వెల్లడించలేదు.
హైతీ తిరుగుబాటుదారులకు బుద్ధి చెప్పేందుకు చేపడుతున్న ఈ ఆపరేషన్కు ఈజిప్ట్, పాకిస్తాన్, జోర్డాన్, మొరాకో, సూడాన్ మద్దతు నిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని సౌదీ అధికార న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. గురువారం జరిపిన వైమానిక దాడుల్లో హైతి ఫైటర్ విమానాలు ధ్వంసమయ్యాయని సౌదీ సలహాదారు ఒకరు వెల్లడించారు.
వైమానిక దాడుల్లో సనాలోని తిరుగుబాటుదారుల స్థావరాలు కొన్ని ధ్వంసమయ్యాయని మిలిటరీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న సనా విమానాశ్రయం, దేశ రాజధానిలోని ఇతర ప్రాంతాల్లో వైమానిక దాడులవల్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఆపరేషన్లో పాల్గొనాలనే సౌదీ చేసిన విజ్ఞప్తిని పాకిస్తాన్ కూడా పరిశీలిస్తోంది. మరోవైపు, ఆ దేశంలో పరిస్థితి దిగజారుతుందని, దాడులు నిలిపేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
యెమెన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ అక్కడి పరిస్థితుల పైన సమీక్ష నిర్వహిస్తోంది. ఆ దేశంలో చిక్కకున్న భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. వైమానిక, నౌక దళం తదితర విభాగాలతో విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం సమావేశం నిర్వహించింది. యెమెన్లోని భారత రాయబారి కేంద్రమంత్రి సుష్మాతో ఫోన్లో మాట్లాడారు. యెమెన్లో యుద్ధ మేఘాల నేపథ్యంలో అక్కడి వారంతా భారత్కు రావాలని చెబుతున్నారు.
ఢిల్లీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు పని చేస్తుంది. యెమెన్లో దాదాపు మూడువేల ఐదు వందల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది నర్సులు. యెమెన్లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు రెండు ఓడలను పంపించనున్నట్లు సుష్మా చెప్పారని కేరళ ముఖ్యమంత్రి చెప్పారు. వాయుమార్గం ద్వారా రప్పిస్తామని సుష్మా చెప్పారు.