భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దారుణహత్య: అనేక ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కరడుగట్టిన ఉగ్రువాది ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ని హతమార్చారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్ కోట్లో ఈ ఘటన సంభవించింది.
ఆ ఉగ్రవాది పేరు షహీద్ లతీఫ్. భారత్ విడుదల చేసిన మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల జాబితాలో అతని పేరుంది. 2016 జనవరిలో పంజాబ్లోని పఠాన్కోట్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి మాస్టర్ మైండ్ అతనే. ఆ ఘటనలో తొమ్మిదిమంది జవాన్లు అమరవీరులయ్యారు. అయిదు మంది ఉగ్రవాదులు హతం అయ్యారు.

జమ్మూ కాశ్మీర్లోనూ అనేక అసాంఘిక కార్యకలాపాల్లో అతని ప్రమేయం ఉంది. పోలీసులు, భద్రత సిబ్బంది, జవాన్లపై దాడులకు పాల్పడ్డాడు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం లతీఫ్ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా గుర్తించింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ గతంలో ఓ ప్రకటన జారీ చేసింది.
అవాంఛనీయ సంఘటన నిరోధక చట్టం కింద అతనిపై కేసులనూ నమోదు చేసింది ఎన్ఐఏ. అతణ్ని బంధించడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు సాగించింది. డ్రగ్స్ సరఫరా కేసులో 1994లో జమ్మూలో నార్కొటిక్స్ అండ్ టెర్రరిజం నిరోధక విభాగం లతీఫ్ను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైలు శిక్షను అనుభవించాడు. విడుదలైన తరువాత లతీఫ్ పాకిస్తాన్లో జిహాదీ ఆర్మీలో చేరినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది అప్పట్లో.
1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ 814ను ఉగ్రవాదులు హైజాక్ చేసి, ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లిన ఉదంతం తెలిసింది. విమానం, ప్రయాణికులను విడిచిపెట్టడానికి ఉగ్రవాదులు డిమాండ్ చేసిన వారిలో షహీద్ లతీఫ్ ఒకడు.
ప్రస్తుతం సియాల్కోట్లో ఉంటోన్నాడు లతీఫ్. ఈ తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని ఇండియాటుడే వెబ్సైట్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురింత చేసింది. షహీద్ లతీఫ్ హత్యోదంతాన్ని స్థానిక మీడియా నిర్ధారించింది. ఎవరు చంపారనేది ఇంకా తెలియరావట్లేదని తెలిపింది.












Click it and Unblock the Notifications