ఇరాన్లో ఒక గుడ్డు ధర అక్షరాలా.. : ఆధునిక కరువు అంటే ఇదేనా?
ఇరాన్ ప్రస్తుతం ఒక విచిత్రమైన, అత్యంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు గర్జిస్తుంటే, అంతర్గతంగా ఆ దేశం ఆర్థిక సునామీలో చిక్కుకుంది. బయటకు అమెరికా వంటి అగ్రరాజ్యాలను ధీటుగా ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నా, సామాన్యుడి వంటగదిలో మాత్రం ఆకలి మంటలు చెలరేగుతున్నాయి. నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో, ఇరాన్ ఇప్పుడు 'ఆధునిక కరువు' (Modern Famine) అంచున నిలబడింది.
నిత్యావసరాలు.. సామాన్యుడికి 'విలాసాలు'
ఇరాన్లో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 112 శాతానికి చేరుకుంది. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న వస్తువులు ఇప్పుడు 'లగ్జరీ' వస్తువులుగా మారిపోయాయి. తాజా మార్కెట్ విశ్లేషణల ప్రకారం మన రూపాయిల్లో ధరల పరిస్థితి ఇలా ఉంది:
- కోడిగుడ్లు: ఒక్కో గుడ్డు ధర సుమారు1.5 లక్షల రియాల్స్ (దాదాపు రూ.10) కు పైగా పలుకుతోంది.
- బియ్యం: కిలో బియ్యం కొనాలంటే సామాన్యుడు వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది.
- వంట నూనె: దీని ధరలు ఏకంగా 200% పెరిగాయి.
- పాలు: లీటరు పాల ధర సుమారు 8 లక్షల రియాల్స్ (సుమారు రూ.55) మార్కును తాకుతోంది.
చివరికి మనిషి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి అయ్యే ఖర్చులు కూడా 40% పెరగడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

కుప్పకూలిన కరెన్సీ.. కనుమరుగైన ఉద్యోగాలు
ఇరాన్ కరెన్సీ 'రియాల్' విలువ పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 16 లక్షల రియాల్స్ కు చేరువలో ఉంది. దీనివల్ల ప్రజలు దాచుకున్న పొదుపు సొమ్మంతా ఆవిరైపోతోంది. యుద్ధం మొదలైనప్పటి నుండి సుమారు 10 లక్షల మంది అధికారికంగా ఉద్యోగాలు కోల్పోగా, అనధికారికంగా ఈ సంఖ్య 30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఎటువంటి ఆదాయం లేక సబ్సిడీలపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొంది.
ఆధునిక కరువు అంటే ఏమిటి?
సాధారణంగా కరువు అంటే వస్తువులు దొరక్కపోవడం. కానీ, ఇరాన్లో మార్కెట్లు వస్తువులతో నిండి ఉన్నాయి. కానీ వాటిని కొనే 'స్తోమత' (Purchasing Power) ప్రజల దగ్గర లేదు. దీనినే ఆర్థిక నిపుణులు 'ఆధునిక కరువు' అని పిలుస్తున్నారు. జనం దగ్గర డబ్బు లేకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిని రెస్టారెంట్లు, చిన్న దుకాణాలు మూతపడుతున్నాయి. బ్యాంకులు కూడా చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వేలల్లో ఖాతాలను క్లోజ్ చేస్తున్నాయి.
ముందున్నది ముసళ్ళ పండుగ?
పరిస్థితి ఇలాగే కొనసాగితే, ప్రస్తుతమున్న 80% ద్రవ్యోల్బణం కాస్తా ఏడాది తిరిగేసరికి 500% కి పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. యుద్ధం తెచ్చే విజయాల కంటే, అది మిగిల్చే ఈ ఆర్థిక గాయాలే ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications