ఇజ్రాయెల్ పై మెరుపుదాడికి ఇరాన్ భారీ ప్లాన్..! ఒకేసారి హిజ్బుల్లా, హమాస్, హౌతీలతో..!
అమెరికా సాయంతో ఇరాన్ పై (iran) ఇజ్రాయెల్ (israel) మొదలుపెట్టిన దాడులు ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఎలా ముగింపు పలకాలో తెలియక అమెరికా సతమతం అవుతూనే ఉంది. మధ్యలో చర్చలు, శాంతి ఒప్పందం పేరుతో కొంతకాలం హంగామా చేసినా, ఇజ్రాయెల్ ఒత్తిడితో అమెరికా ఈ యుద్దాన్ని ఇంకా కొనసాగిస్తోంది. రెండు నెలల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఎదుర్కోబోతున్న ట్రంప్ సర్కార్ కు ఇరాన్ యుద్దం తలనొప్పిగా తయారైంది. దీంతో కొంతకాలం యుద్దాన్ని ఆపి, ఇరాన్ ను ఆర్ధిక దిగ్బంధం చేసే దిశగా ట్రంప్ ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఇదే అదనుగా ఇరాన్ రూటు మారుస్తోంది.
ఇజ్రాయెల్ పై ఇరాన్ మెరుపుదాడి ? (Iran)
ఇన్నాళ్లూ అమెరికా అండతో తమపై రెచ్చిపోయిన ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఒకేసారి తమకు అండగా ఉంటున్న మిలిటెంట్ గ్రూపులు హమాస్, హిజ్బొల్లా, హౌతీలతో కలుపుకుని ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడి తరహాలోనే, ఈసారి అంతకంటే ప్రమాదకరమైన ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది.ఇజ్రాయెల్ ను అన్ని వైపుల నుంచి ఏకకాలంలో ముట్టడించి, ఆత్మరక్షణలో పడేయడమే ఈ సరికొత్త ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

హిజ్బుల్లా, హమాస్, హౌతీలతో
ఇజ్రాయెల్ సైనిక అంచనాల ప్రకారం, ఈ ఉమ్మడి సైనిక చర్యలో లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల, ఇరాక్లోని బలమైన ఇరాన్ అనుకూల మిలిషియాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత అక్టోబర్ 7 దాడి ప్రధానంగా హమాస్ నేతృత్వంలో మాత్రమే సాగింది. అయితే, ఈసారి అన్ని భాగస్వామ్య శక్తులు ఒకే బలమైన వ్యూహంలో భాగంగా ప్రారంభం నుంచే క్రియాశీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. లెబనాన్లో హిజ్బుల్లా ఎదుర్కొన్న భారీ నష్టాలు, అలాగే సిరియాలో బషర్ అల్-అసద్ పాలన పతనం కావడం పశ్చిమాసియాలో ఇరాన్ వ్యూహాన్ని మార్చివేశాయి.

అనుకూల పరిస్దితులు
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాక్ మిలిషియాలు, యెమెన్ హౌతీల ప్రాముఖ్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైన్యానికి చెందిన ఖుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఆయా ప్రాక్సీ గ్రూపుల కమాండర్లతో నిరంతర చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా, గత దాడుల్లో దెబ్బతిన్న తమ ఆయుధ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి ఇరాన్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల తయారీని కూడా వేగవంతం చేసింది. గతంలో హమాస్ నేత యాహ్యా సిన్మార్ అక్టోబర్ 7న ఇస్రాయెల్పై దాడి ప్రారంభించినప్పుడు ఇతర శక్తులతో ముందస్తుగా పూర్తిస్థాయి సమన్వయం చేసుకోలేదు. దాడి ప్రారంభమైతే హిజ్బుల్లా, ఇరాన్ నేరుగా యుద్ధంలోకి వస్తాయని సిన్మార్ భావించినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఆ సమయంలో హిజ్బుల్లా కేవలం ఉత్తర సరిహద్దుల వద్ద పరిమిత కాల్పులకే పరిమితమైంది. ప్రస్తుత ఇరాన్ ప్రణాళికల ప్రకారం ఆ పొరపాట్లకు తావులేకుండా మొదటి రోజు నుంచే అన్ని వైపుల నుంచి తీవ్రమైన దాడులు చేయడమే ప్రధాన వ్యూహంగా ఉంది.














Click it and Unblock the Notifications