పారిస్ తర్వాత, జీ-20 జరిగే టర్కీలోనూ టెర్రర్
అంకారా: పారిస్లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోక ముందే ఆదివారం జీ-20 సదస్సు జరుగుతున్న టర్కీలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. గాజియన్టెప్ ప్రాంతంలోని ఓ భవనంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ఒంటికి బాంబులు తగిలించుకుని పేల్చేసుకున్నాడు.
ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. టర్కీలో జీ-20 సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు టర్కీలో ఈరోజు నుంచి జీ-20 దేశాల సదస్సు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జీ-20 దేశాల సదస్సు జరిగే ప్రాంగణమంతా రెడ్జోన్గా ప్రకటించారు.
సెరిక్ జిల్లాలోని కార్యా హోటల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సుకు భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితర దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దీంతో జీ-20 సదస్సు పరిసరాల ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను మరింత భద్రతను పెంచారు. దాదాపు 3 వేల మంది జర్నలిస్టులు ఈ జీ-20 సదస్సుని కవర్ చేస్తున్నారు. దీంతో 12వేల మంది భద్రతా సిబ్బంది, 300 మొబైల్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
సదస్సు కోసం కేటాయించిన 30 హోటళ్లలో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ తదితరులు టర్కీలో ఉన్నారు.