సొంతవారినే తగులబెట్టిన ఐసిస్, క్వెట్టాలో పేలినబాంబు
వాషింగ్టన్: ప్రత్యర్థులనే కాకుండా అవసరమైతే సొంత మనుషులను కూడా ఘోరమైన రీతిలో చంపుతామని ఐసిస్ రుజువు చేస్తోంది. ఇరాక్లోని రమాదీలో ప్రభుత్వ దళాల చేతుల్లో ఓటమికి గురైన పారిపోయి వచ్చిన ఐసిస్ అనుయాయులను వారి నేతలు సజీవదహనం చేసిన సంఘటన వెలుగు చూసింది.
ఐసిస్ నరమేధం సృష్టిస్తూ మానవత్వాన్ని మంటగలుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా అది సొంత మనుషుల్నే సజీవ దహనం చేయడం గమనార్హం. మోసుల్ పట్టణంలోని ప్రధాన కూడలిలో సొంత మనుషుల్ని బహిరంగంగా దహనం చేసింది. యుద్ధ రంగం నుంచి పరారై వచ్చినందుకు ఈ శిక్ష విధించింది.
చనిపోయే వరకూ పోరాడకుండా వచ్చేశారంటూ ఉగ్రవాద నాయకులు పారిపోయి వచ్చిన వారి పైన ఆగ్రహం చెందారు. పారిపోయి వచ్చిన వారందరినీ నగరంలోని కూడలిలో సర్కిల్లో నిలబెట్టి తగులబెట్టేశారని అమెరికాలో ఉంటున్న ఇరాక్ పౌరుడు ఒకరు తెలిపాడు.
స్వదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తనకు తెలియజేశారన్నారు. మోసుల్లో బంధువులున్న పలువురు ఇరాకీలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నగరానికి కూడా విముక్తి కల్పించడానికి ఇరాకీ దళాలు పోరాడుతున్నాయి.
కాగా, మోసుల్ నగరంలోని ఐఎస్ఐఎస్కు చెందిన డబ్బు నిల్వ కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసింది. అక్కడ భారీగా ధనం ఉందని అధికారులు పేర్కొన్నారు. 900 కిలోల బాంబులతో భవనాన్ని నేలమట్టం చేసినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా.. ఐసిస్ వద్ద ఉద్యోగం పొందిన న్యూజిలాండ్ వ్యక్తి తన వివరాలను లింకెడిన్ ఖాతాలో నమోదు చేశాడు. తాను విద్యా నిపుణుడినని, ఐసిస్ తరఫున సిరియాలోని రక్కా నగరంలో పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అక్కడ కుటుంబంతో కలసి ఉన్నా ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడు. ఇది మంచి అనుభవమన్నాడు. తన అసలు పేరు మార్క్ జాన్ టేలర్ నుంచి మహ్మద్ డేనియల్గా మార్చుకున్నట్లు చెప్పాడు. తాను ఆంగ్లం బోధిస్తున్నట్లు చెప్పాడు.
పాక్ పైన ఉగ్రదాడి: క్వెట్టాలో బాంబు పేలుడు
పాకిస్థాన్లోని క్వెట్టాపై ఉగ్రవాదులు దాడి చేశారు. జనసమ్మర్దమున్న ప్రాంతంలో శక్తిమంతమైన బాంబులను ఉగ్రవాదులు పేల్చారు. సమాచారం మేరకు... ఈ దాడిలో 10 మంది వరకూ చనిపోగా, సుమారు 20 మంది వరకూ తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది.