Let's Finish the job: జో బైడెన్ సంచలన ప్రకటన..!!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్లో దీనికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడే అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకునట్టే కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే సన్నాహాలు పూర్తి చేశారు. ఈలోపే ఆయన పోర్న్ స్టార్కు అక్రమ చెల్లింపుల కేసు వ్యవహారంలో దోషిగా తేలారు.
వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ ఇదివరకే ప్రకటించారు కూడా. భారత సంతతికి చెందిన మహిళ ఆమె. గతంలో ఆమె ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. అనంతరం రాజకీయాల్లో అడుగు పెట్టారు. రిపబ్లికన్ పార్టీలో చేరారు. సౌత్ కరోలినా గవర్నర్ రెండుసార్లు ఎన్నికయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంప్లో పని చేశారు.

భారత సంతతికే చెందిన వివేక్ రామస్వామి సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. రిపబ్లికన్ల తరఫున ఈ ఎన్నికల్లో నిల్చోనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇదే జాబితాలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, పెర్రీ జాన్సన్, టెడ్డీ క్రజ్, క్రిస్టీ నోయెమ్, మైక్ పాంపియో వంటి హేమాహేమీలు ఉన్నారు. ఈ కంటెండెర్లల్లో రిపబ్లికన్లు ఎవరిని ఎన్నికల బరిలో దింపుతారనేది ఆసక్తిగా మారింది.
Every generation has a moment where they have had to stand up for democracy. To stand up for their fundamental freedoms. I believe this is ours.
— Joe Biden (@JoeBiden) April 25, 2023
That’s why I’m running for reelection as President of the United States. Join us. Let’s finish the job. https://t.co/V9Mzpw8Sqy pic.twitter.com/Y4NXR6B8ly
ఈ పరిణామాల నేపథ్యంలో- అధ్యక్షుడు జో బైడెన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వరుసగా రెండోసారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నానని స్పష్టం చేశారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

ప్రతి తరానికి చెందిన వారు కూడా ప్రజాస్వామ్యం కోసం ఎదురు నిల్చోవాల్సిన క్షణం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుగా తమకు సంక్రమించాల్సిన స్వేచ్ఛ కోసం ఆ తరం వారు నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. దీన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని జో బైడెన్ వ్యాఖ్యానించారు. అందుకే తాను అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ పోటీ చేయదలచుకున్నానని ప్రకటించారాయన. మిగిలివున్న పనులను ఫినిష్ చేద్దామంటూ పిలుపునిచ్చారు.
దీనితో- వచ్చే ఎన్నికల్లో జో బైడెన్ పోటీ చేస్తారనే విషయాన్ని నిర్ధారించినట్టయింది. 3:04 సెకెన్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్ను తన ట్వీట్కు జోడించారు జో బైడెన్. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో కలిసి 2019 నాటి ఎన్నికల ప్రచారంలో పాల్గన్న కొన్ని దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే- వివిధ రంగాల్లో అమెరికా.. అగ్రరాజ్యంగా ఎదిగిన సందర్భాలను కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు.
అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇప్పటికే ఇద్దరు రేసులో నిల్చొన్నారు. ప్రముఖ రచయిత్రి మరియాన్నె విలియమ్సన్, వ్యాక్సినేషన్ వ్యతిరేక ఉద్యమ కార్యకర్త రాబర్ట్ కెన్నెడీ జూనియర్.. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. కమలా హ్యారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇక తాజాగా జో బైడెన్ తీసుకున్న నిర్ణయంతో డెమోక్రాట్లు ఆయనకే మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications