1939లోనే బ్రేకింగ్ అందించిన సంచలనం.. ఆ జర్నలిస్టు ఇకలేరు..
1939, ఆగస్టులో నాజీల దాడిని రిపోర్టును చేసి రెండో ప్రపంచ యుద్ధ వార్తను బ్రేకింగ్ న్యూస్ గా అందించారు క్లేర్ హాలింగ్.
హాంకాంగ్: ప్రఖ్యాత జర్నలిస్టు క్లేర్ హాలింగ్(105) కన్నుమూశారు. సాధారణ మహిళగా జర్నలిస్టు వృత్తిని చేపట్టిన హాలింగ్ అత్యుత్తమ జర్నలిస్టుగా ఎంతోమంది మన్ననలు పొందారు. ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధం సమయంలో.. యుద్ధ వార్తను బ్రేకింగ్ న్యూస్ గా మొట్టమొదట ప్రపంచానికి అందించింది క్లేర్ హాలింగే.
27ఏళ్ల వయసులో క్లేర్ హాలింగ్ జర్నలిజంలోకి వచ్చారు. లండన్ డెయిలీ టెలిగ్రాఫ్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో.. 1939, ఆగస్టులో నాజీల దాడిని రిపోర్టును చేసి రెండో ప్రపంచ యుద్ధ వార్తను బ్రేకింగ్ న్యూస్ గా అందించారు క్లేర్ హాలింగ్.
జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన వారం రోజుల్లోగానే రెండవ ప్రపంచ యుద్ద వార్తతో జీవిత కాలానికి సరిపడా పేరు తెచ్చుకున్నారు. వైవిధ్యమైన జర్నలిజంతో అనేకానేక అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. వాటిల్లో ప్రముఖ 'వాట్ ద పేపర్ సే' వంటి అవార్డు కూడా ఉండటం విశేషం.
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి మరీ ఆమె తన జర్నలిస్టు పయనాన్ని కొనసాగించారు. 1946లో జెరూసలెంలోని కింగ్ డేవిడ్ హోటల్ ను ఉగ్రవాదులు కూల్చివేసిన ఘటనలో 100మంది చనిపోగా.. ఆ హోటల్ కు కేవలం 300గజాల దూరంలో ఉండి వార్తను కవర్ చేశారు.
అలాగే వియత్నాం యుద్ధం, అల్జీరియన్ స్వాతంత్ర్య పోరాటంలోని తదితర క్లిష్టమైన ఘట్టాలను హాలింగ్ కవర్ చేశారు. లింగ వివక్షను ఎదుర్కొంటూనే అటు జీవితంలోను.. ఇటు జర్నలిజంలోను ఆమె ఉన్నత స్థానాన్ని చేరుకున్నారు.
బ్రిటీష్ సామ్రాజ్యంలో.. క్వీన్ ఎలిజబెత్ II కాలంలో ఆర్డర్ ఆఫ్ ఆఫీసర్ గా హాలింగ్ పనిచేశారు. అలాగే మాజీ బ్రిటీష్ ప్రధాని టెడ్ హీత్, మాజీ హాంకాంగ్ గవర్నర్ క్రిస్ పాటెన్ సహా పలు బ్రిటీష్ సైనికాధికారులు హాలింగ్ కు అభిమానులుగా ఉండటం ఆమె జర్నలిజం ప్రతిభకు అద్దం పట్టే విషయం.
జీవితం చివరి రోజుల్లోను అనేక అంతర్జాతీయ పత్రికలకు హాలింగ్ ఆర్టికల్స్ రాశారు. వాటిల్లో ప్రఖ్యాత ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, ఆసియా వాల్ స్ట్రీట్ జర్నల్ ఉన్నాయి. ఇటీవలే తన 105వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు హాలింగ్. ఆమె మరణం జాతీయ అంతర్జాతీ మేధావులు, జర్నలిస్టులను విషాదంలో ముంచెత్తింది.