శుభవార్త: అమెరికాతో చర్చలకు సిద్దమన్న కిమ్, తటస్థ ప్రదేశంలో భేటీ
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సంచలనం నిర్ణయం తీసుకొన్నారు. అణు పరీక్షలను నిలిపివేసి అమెరికాతో శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్టు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటించారు. ఈ విషయాన్ని రెండు దేశాల అధికారులు ప్రకటించారు.ఈ ప్రకటనతో ప్రపంచదేశాల్లో శాంతియుత వాతావరణం వెల్లివిరిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణలు ప్రయోగంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటూ సవాల్ విసిరారు. అమెరికాతో పాటు ఆ దేశానికి మిత్రులుగా ఉన్న దేశాలపై తన శక్తిని చూపి భయబ్రాంతులకు గురి చేశాడు కిమ్ జంగ్ ఉన్.
అయితే కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్ జంగ్ ఉన్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి కిమ్ జంగ్ ఉన్ దక్షిణ కొరియాతో శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అంతేకాదు దక్షిణకొరియాలో జరిగిన వింటర్ ఒలంపిక్స్కు తమ దేశం నుండి ప్రతినిధులను కూడ పంపారు.
అమెరికాతో చర్చలకు సిద్దమన్న కిమ్
అమెరికాతో చర్చలకు తాను సిద్దంగా ఉన్నానని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. అణు పరీక్షలను కూడ తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం కొంత కాలంగా ఈ రెండు దేశాలకు చెందిన అధికారులు రహస్యంగా చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో పురోగతి వచ్చిందని ఈ రెండు దేశాల అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.ఈ మేరకు అమెరికాతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సానుకూలంగా స్పందించారు. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య సృహద్భావ వాతావరణం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని చర్చ కూడ సాగుతోంది.
తటస్థ ప్రదేశంలో చర్చలు
అమెరికా, దక్షిణ కొరియాకు చెందిన దేశాల అధ్యక్షులు త్వరలోనే తటస్థ ప్రదేశంలో సమావేశం కానున్నారు. ఆదివారం నాడు ప్యాంగ్యాంగ్ అధికారులు నేరుగా సంకేతాలను పంపారు. త్వరలో తటస్థ ప్రదేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. అయితే అందుకు సానుకూలమైన వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని అమెరికా భావిస్తోంది.
శుభవార్తను వినే అవకాశం ఉంది
ప్రపంచదేశాలన్నీ త్వరలోనే శుభవార్తను వింటాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహరంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూతలు కూడ జోక్యం చేసుకొనే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరిగి సామరస్యపూర్వక వాతావరణం ఏర్పాటైతే ప్రపంచదేశాలకు శుభవార్తేనని అమెరికా అభిప్రాయంతో ఉంది.
చర్చలెప్పుడు జరుగుతాయి
అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షుల మధ్య ఎప్పుడు చర్చలు జరుగుతాయనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అంతేకాదు ఈ రెండు దేశాధ్యక్షులు ఎక్కడ సమావేశమౌతారనే విషయమై కూడ స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ రెండు దేశాలు చర్చలు చేయాలని ఆలోచించడం శుభపరిణామని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.