మోడీ మరో విజయం, మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్: ఆస్తులు సీజ్! ఇంట్లో సోదాలు
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు భారీ షాక్. అతని ఆస్తులు జఫ్తు చేయాలని యూకే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లండన్ సమీపంలోని హెర్ట్ఫోర్డ్షైర్లోని మాల్యాకు చెందిన ఆస్తులను జఫ్తు చేయాలని సదరు న్యాయస్థానం ఆదేశించింది.
అంతేకాదు, అతను నివాసం ఉంటున్న చోట సోదాలు చేయాలని చెప్పింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిగణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మాల్యా విషయంలో భారత ప్రభుత్వం చర్యలను సమర్థించింది. కాగా, లండన్ కోర్టు ఆదేశాలు భారత ప్రభుత్వం విజయం కాగా, బ్యాంకులకు ఊరట అని చెప్పవచ్చు.
కాగా, మాల్యాకు చెందిన ఆస్తుల వివరాల విషయంలో కొంత స్పష్టత వచ్చింది. మొత్తం 159 చోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఈడీతో కలిసి బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించిన నివేదికలను గురువారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మాల్యాకు చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు మరింత సమయం కావాలని కోరారు.